తెలంగాణ కేబినెట్ సమావేశం, సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకులు

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 06:33 AM IST
తెలంగాణ కేబినెట్ సమావేశం, సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకులు

telangana cabinet meeting : కేంద్ర ప్రభుత్వ నిబంధనలు…. సన్నాల బోనస్‌ చెల్లింపుకు అడ్డంకిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ చేసుకున్న ఎంవోయూ… బోనస్‌ ఇవ్వడానికి అడ్డుగా మారినట్టు కేబినెట్‌ అభిప్రాయపడింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం.. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.



రైతుల ఆందోళనపై చర్చ :-
తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సన్నాలపై జరుగుతున్న రైతుల ఆందోళనలపై కేబినెట్‌లో చర్చించింది. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించింది. సన్నాలకు బోనస్‌ చెల్లింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. క్వింటాల్‌కు 150 రూపాయల చొప్పున బోనస్‌ చెల్లించేందుకు సర్కార్‌ సిద్ధంగా ఉన్నా… కేంద్ర ప్రభుత్వ వైఖరితో అది సాధ్యమయ్యేలా లేదని కేబినెట్‌ ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కుదుర్చుకున్న ఎంవోయూలోని నిబంధనలు.. బోనస్‌ చెల్లింపుకు అడ్డంకిగా ఉన్నాయని అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరకన్నా రాష్ట్రాలు ఒక్క రూపాయి అదనంగా చెల్లించినా రాష్ట్రాలు సేకరించిన ధాన్యాన్ని సెంట్రల్‌ పూల్‌కింద స్వీకరించబోమని కేంద్రం ఎంవోయూలో పొందుపర్చిన నిబంధనలు ప్రతికూలంగా మారాయని మంత్రులు అభిప్రాయపడినట్టు సమాచారం.



గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు :-
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలపైనా కేబినెట్‌ చర్చించినట్టుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటుగా.. త్వరలో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశమున్నట్టు కేసీఆర్‌ మంత్రులకు వివరించారు. అన్నిచోట్లా గులాబీ జెండా ఎగురవేయాలని మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో పేదలకు సంబంధించిన నల్లా, విద్యుత్, ఆస్తి పన్ను బకాయిల మాఫీ అంశాన్ని కూడా కేబినెట్‌ చర్చించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.



సాదాబైనామాల క్రమబద్ధీకరణ :-
ఇక సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరపడం, మెరూన్‌ రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త చట్టం తేవాలని డిసిషన్‌ తీసుకున్నట్టగా తెలుస్తోంది. రద్దయిన పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు సాదాబైనామాలకు క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలపై మంతివర్గం చర్చించింది.



ఒకటి, రెండు రోజుల్లో ఆర్డినెన్స్ :-
సాదాబైనామాలకు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో పాత ఆర్‌ఓఆర్‌ చట్టంలోని నిబంధనలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త చట్టం కింద సాదా బైనామాలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద పరిష్కరించేందుకు ఆర్డినెన్స్‌ తేవాలనే ప్రతిపాదనను కేబినెట్‌ చర్చించి ఆమోదించింది. కేబినెట్‌ ప్రతిపాదించిన ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదానికి పంపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అసెంబ్లీ ఆరో విడత సమావేశాలు ప్రొరోగ్‌ అయితేనే ఆర్డినెన్స్‌ ఆమోదం పొందే అవకాశం ఉండటంతో వెంటనే ప్రొరోగ్‌ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త రెవెన్యూ చట్టం కింద సాదా బైనామాల క్రమబద్దీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.