Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ…లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకునే చాన్స్
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారా..? కోవిడ్ను నియంత్రించాలంటే లాక్ వేయక తప్పదా..? ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా..?
Telangana cabinet : తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారా..? కోవిడ్ను నియంత్రించాలంటే లాక్ వేయక తప్పదా..? ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా..? ఈ ప్రశ్నలకు ఇవాళ ఆన్సర్ దొరుకుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో.. లాక్డౌన్పై కేసీఆర్ సర్కార్ క్లారిటీ ఇస్తుందా..? హైకోర్టు చర్యలు తీసుకునే లోపే.. సర్కార్ నిర్ణయాన్ని ప్రకటిస్తుందా..?
తెలంగాణను సెకండ్ వేవ్ భయపెడుతోంది. కోవిడ్ కేసులు రోజూ వేలల్లో నమోదవుతున్నాయి. రోజురోజుకు బాధితులు పెరుగుతున్నారు. దీంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్, రెమ్డెసివర్ ఇంజెక్షన్ల కొరత ఉంది. దీంతో చాలా మందికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైరస్కు అడ్డుకట్ట వేయడం కష్టతరంగా మారుతుందని హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది.
కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటం.. మరోవైపు పొరుగు రాష్ట్రాలు లాక్డౌన్, డే కర్ఫ్యూను అమలు చేస్తూ వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ సైతం లాక్వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో పరిస్దితి పూర్తిగా చేయి దాటిపోకముందే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్లో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాల గురించి కీలక చర్చ జరిగే అవకాశముంది. ఈనెల 14 నుంచి 25 వరకు లాక్డౌన్ విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణ సీఎం. లాక్డౌన్ ఒక్కటే కరోనా కట్టడికి మందని.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు షట్డౌన్ అయ్యాయి. దీంతో.. తెలంగాణలో లాక్డౌన్ విధింపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు మంత్రివర్గంలో కీలక చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు కూడా కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం.. ఇవాళ కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ ఉండటంతో.. ఆంక్షలు పెట్టే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అయితే.. లాక్డౌన్ పాక్షికమా.. వారాంతమా.. పూర్తిగానా..? అసలు లాక్డౌన్ పెట్టాలా? వద్దా? అని చర్చించి ప్రజలకు ఒక స్పష్టమైన ప్రకటన వెల్లడించనుంది తెలంగాణ సర్కార్. సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కరోనా పరిస్థితులపై నేడు జరిగే మంత్రివర్గ సమావేశం కీలకం కానుంది.