Telangana CID Chief: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సీఐడీ చీఫ్కు గాయాలు.. భార్య మృతి
తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రాజస్థాన్లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ సతీమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు.

Telangana CID Chief: తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ సతీమణి షీలా సింగ్ అక్కడికక్కడే మరణించారు. గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు, మరొకరు గాయపడ్డట్లు సమాచారం. రాజస్థాన్లోని జైసల్మేర్ పరిధిలో ఈ ఘటన సోమవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్ సింగ్, తన భార్యతో కలిసి రాజస్థాన్లోని మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని దర్శించుకోవడానికి కారులో వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని, తిరిగి వస్తుండగా, రామ్ఘడ్ ప్రాంతంలోని రహదారిపై ఘంటియాలీ మాత ఆలయం దగ్గర కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ ఘటనా స్థలంలోనే మరణించింది. గోవింద్ సింగ్, డ్రైవర్ విజయేందర్ కూడా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జవహర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీజీ గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.