telangana endoment department : ఇంటి వద్దకే దేవుడి ప్రసాదం

దేవుడి ప్రసాదం కావాలంటే కచ్చితంగా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే లభించేది. కానీ తెలంగాణ దేవాదాయశాఖ మాత్రం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

telangana endoment department : ఇంటి వద్దకే దేవుడి ప్రసాదం

Prasadam

telangana endoment department : దేవుడి ప్రసాదం కావాలంటే కచ్చితంగా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే లభించేది. కానీ తెలంగాణ దేవాదాయశాఖ మాత్రం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నేరుగా ఇంటి వద్దకే స్వామి వారి ప్రసాదం, అక్షింతలు, కుంకుమను స్పీడ్ పోస్ట్ ద్వారా అందించనున్నారు. తపాలాశాఖ ద్వారా వీటిని చేరవేయనున్నారు. తీర్థ ప్రసాదాలు నేరుగా పోస్టల్ శాఖ ద్వారా భక్తుల ఇంటికి చేరనున్నాయి.

తెలంగాణలో పది ప్రధాన దేవాలయాల ప్రసాదాలను నేరుగా ఇళ్లకే పంపే ప్రత్యేక సేవను రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు నిన్న తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ, సికింద్రాబాద్‌ గణేశ్, బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఈ సేవలు ప్రారంభించారు.

భక్తులు ఈ దేవాలయాల ప్రసాదాలు కావాలని స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఆయా ఆలయాల నుంచి ప్రసాదం వారి ఇంటికి తపాలా ద్వారా చేరుతుంది. అయితే ఆయా దేవాలయాలకు ప్రత్యేక ప్రసాదాలుంటాయి. పులిహోర, దధ్యోదనం, లడ్డూ, రవ్వకేసరి లాంటివి. కానీ, ఇవి రెండుమూడు రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉండదు. దీనికోసం తపాలా ద్వారా డ్రైఫ్రూట్స్, రవ్వ పొడి ప్రసాదాలను మాత్రమే పంపనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 1.60 లక్షల తపాలా కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా ఆయా దేవాలయాల ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ ప్రారంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ నేరుగా తమ పేరుతో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం లేని వారు ఆన్‌లైన్‌లో గోత్రనామాలు, పూజ జరగాల్సిన తేదీని బుక్‌ చేసుకుంటే ఆ రోజు వారి పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐటీ శాఖ రూపొందించిన టీ యాప్‌ ఫోలి యో ద్వారా 22 దేవాలయాల్లో ఈ సేవలు పొందే వీలుంది.

తాజాగా పూజలతోపాటు ప్రసాదాలు కూడా పొందే వీలును తపాలాశాఖతో కలిసి ఏర్పా టు చేసింది. శనివారం అరణ్య భవన్‌లోని కార్యాలయంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, తపాలాశాఖ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కృష్ణవేణి, హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌రెడ్డి, హైదరాబాద్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ సాగర్‌ హనుమాన్‌ సింగ్, డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ ఎస్వీ రావు తదితరులు పాల్గొన్నారు.