Covid Patients Beds : కోవిడ్ సెంటర్స్గా ప్రైవేట్ హాస్పిటల్స్..బెడ్స్ పెంచడంపై టీ.సర్కార్ దృష్టి
తెలంగాణను సెకండ్ వేవ్ భయపెడుతుందా? కోవిడ్ రోగులకు బెడ్స్ కొరత ఉందా? బెడ్స్ను పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది?
Telangana Government focus : తెలంగాణను సెకండ్ వేవ్ భయపెడుతుందా? కోవిడ్ రోగులకు బెడ్స్ కొరత ఉందా? బెడ్స్ను పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది? తెలంగాణలో లాక్డౌన్ తప్పదా? తెలంగాణలో సెకండ్ వేవ్ చాలా ఫాస్ట్గా విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. కోవిడ్ పేషంట్లతోపాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కోవిడ్ టెస్ట్ల కోసమైతే జనం ఆస్పత్రుల దగ్గర ఎగబడుతున్నారు. దీంతో పలు పీహెచ్సీల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో ఎక్కువశాతం మైల్డ్ సింప్టమ్స్వే ఉన్నాయి. కానీ మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో జనాల్లో భయాందోళన నెలకొంది..
రోజురోజుకు కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో…బెడ్స్ పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ను పెంచిన సర్కార్.. ప్రైవేట్లోనూ వీలైనన్ని హాస్పిటల్స్ను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపుగా 60వేల పడకలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు.. నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మరో 350 పడకలు, నిమ్స్లో మరో 200 బెడ్స్ను రెడీ చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
తెలంగాణలో మొత్తం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అందిస్తోంది సర్కార్. ప్రైవేట్లో దాదాపుగా వెయ్యి ఆస్పత్రుల్లో కోవిడ్కు చికిత్స చేస్తున్నారు. కోవిడ్ రోగులతో జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో కోవిడ్ రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్స్ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ పరిధిలోని భవనాల్లోనూ వైద్యం అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
కొన్ని జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య విపతీరంగా పెరుగుతోంది. హైదరాబాద్లాంటి మహానగరంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో రాజధానిలో 63 మైక్రో కంటైన్మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు. కేసుల పరిస్థితి ఇలాగే ఉంటే లాక్డౌన్ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు రావద్దని లాక్డౌన్ విధించవద్దని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. వైరస్ చైన్ బ్రేక్ చేయడానికి లాక్డౌన్ తప్పదన్న భావనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత లాక్డౌన్ వెళ్లేందుకు కసరత్తులు సాగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి వీటిలో వాస్తవం ఎంతో తెలియాలంటే మే 2వరకు ఆగాల్సిందే.