తుంగభద్ర పుష్కరాలపై మార్గదర్శకాలు జారీ…కరోనా నెగిటివ్ ఉన్నవారికే పుష్కర ఘాట్లలోకి అనుమతి
Tungabhadra pushkars guidelines : నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలపై తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే నదిలో స్నానాలకు అనుమతి ఇస్తామని చెప్పింది. 12 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడినవారు పుష్కరాలకు రావొద్దని సూచించింది.
కరోనా నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్లలోకి అనుమతిస్తామన్నారు. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్ర్కీనింగ్ చేసిన అనంతరం ఘాట్ల దగ్గరకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పుష్కర ఘాట్ల దగ్గరకు అనుమతి లేదన్నారు.
ఇక పుష్కర స్నానం చేసిన తర్వాత దైవదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కాబట్టి పుష్కర ఘాట్లకు సమీపంలో ఉన్న అన్ని ఆలయాల దగ్గర శానిటైజర్లు, థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరిగా చేస్తున్నామన్నారు. మాస్కు ధరించడం, ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి చేసింది.
https://10tv.in/bengaluru-businessman-to-donate-rs-700-crore-for-renovation-of-chottanikkara-temple/
కొవిడ్ నిబంధనలకు లోబడి పుష్కరస్నానాలకు అనుమతి ఇవ్వనున్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.5 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటు చేయాలన్నారు.
మరోవైపు ఏపీ సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాలను కర్నూలులోని సంకల్భాగ్ పుష్కర ఘాట్లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.