TS Governor : రాజ్ భవన్ లో రాజకీయ కార్యక్రమాలా?గవర్నర్ తమిళి సై ‘మహిళా దర్బార్’ చేపట్టి లక్ష్మణ రేఖ దాటుతున్నారు: సీపీఐ నారాయణ
రాజ్ భవన్ లో రాజకీయ కార్యక్రమాలా?గవర్నర్ తమిళి సై ‘మహిళా దర్బార్’ చేపట్టి లక్ష్మణ రేఖ దాటుతున్నారు అంటూ సీపీఐ నారాయణ విమర్శించారు.
TS Governor Tamilsai Mahila Darbar in Raj Bhavan : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన ‘మహిళా దర్భార్’ను రద్దు చేయాలని రాజ్ భవన్ ను రాజకీయ కార్యకలాపాలకు వాడుతున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధం అని సీపీఐ నారాయణ విమర్శించారు. మహిళా దర్భార్ తలపెట్టి తమిళసై లక్ష్మణరేఖ దాటుతున్నారంటూ నారాయణ విమర్శించారు. కాగా..గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించాల నిర్ణయం తీసుకుని దాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సీపీఐ నాయకుడు నారాయన స్పందిస్తూ.. గవర్నర్ రాజ్భవన్ వేదికగా రాజకీయ కార్యకలాపాలకు వేదిక చేస్తున్నారని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని అన్నారు. గవర్నర్ మహిళల దర్బార్ దేనికిపెడుతున్నారు ? సహజంగా ఎవరైనా ప్రతినిధి వర్గం వస్తే కలవవచ్చు. వారిచ్చే సమస్యల వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చు . అంతేగాని గవర్నర్ రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ ను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ నారాయణ విమర్శించారు.
గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తోందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజకీయ పరంగా వ్యవహరిస్తున్నారని..ఇది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేఖం అని.. మహిళా దర్బార్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ రాజకీయాలతో సంబంధం లేకుండా నడుచుకోవాలని కోరారు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య కొంతకాలంలో వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా రాజ్ భవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య గ్యాప్ పెద్దగానే ఉన్న సంగతి తెలిసిందే.
కాగా..మహిళల సమస్యలను తెలుసుకొనేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై జూన్ 10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ దర్బార్ లో పాల్గొనే మహిళలు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాలని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. జూన్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మహిళా దర్బార్ ను నిర్వహించాలని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా..తెలంగాణలో మే నెలలో వరుస అత్యాచారాలు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. హైద్రాబాద్ అమ్నేషియా పబ్ తో పాటు మరికొన్ని ఘటనలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.ఈ సమయంలో గవర్నర్ తమిళిసై మహిళ దర్బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.