Ration Cards : తెలంగాణలో త్వరలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏడేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని నిర్ణయించింది.

Ration Cards : తెలంగాణలో త్వరలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

Ration Cards Ts

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏడేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని నిర్ణయించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను  పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఆహార భద్రత కార్డుల మంజూరు కోసం పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌కు పౌరసరఫరాల శాఖ కసరత్తు వేగవంతం చేస్తోంది. మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పెండింగ్ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రేషన్ కార్డుల మంజూరు ఆగిపోయింది. కార్డుల్లో తప్పులు సరి చేయడం, వ్యక్తుల పేర్లు, వివరాలు తొలగించడం, చేర్చడం వంటివి కూడా నిలిపివేశారు.

కాగా రాష్ట్రంలో ఇప్పటికే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద 53 లక్షల 55 వేల 797 కార్డులకు గానూ కోటి 91 లక్షల 69 వేల 619 మంది లబ్దిదారులున్నారు. వీరికి అదనంగా రాష్ట్రం ఇచ్చిన 33 లక్షల 85 వేల 779 కార్డుల ద్వారా 87 లక్షల 54 వేల 681 మంది లబ్దిదారులున్నట్లు పౌరసరఫరాల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా 4 లక్షల 46 వేల 169 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రివర్గంలో చర్చజరిగింది. ఇవి కాకుండా జిల్లాల్లో రేషన్ కార్డు కోసం వేలాది దరఖాస్తులున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 2014 నుంచి 2021 వరకు లక్షా 70 వేల 262 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. హైదరాబాద్‌ పౌరసరఫరాల విభాగం పరిధిలో 5 లక్షల 85 వేల 39 కార్డులు ఉండగా 21 లక్షల 85 వేల 668 యూనిట్లున్నాయి. సగటున మరో మూడు లక్షల కుటుంబాలకు పైగా కార్డులు లేవు. కాగా గత ఆరు నెలల వ్యవధిలో మీ సేవ అధికార లెక్కల ప్రకారం కొత్త కార్డుల కోసం సుమారు 2 లక్షల 68 వేల 963 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.

కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించడడంతో.. జారీ ప్రక్రియ వేగవంతమైంది. పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌కు టార్గెట్లు విధించారు అధికారులు. వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రెండు కమిటీలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఏడు రోజుల్లో కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో చాలా కార్డుల్లో పేర్ల మార్పు జరగలేదు. మరణించిన వారు, కొత్తగా పెళ్లైన వారి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల ఏర్పాటు ప్రక్రియ వేగం చేశారు. కొత్తగా పెళ్లై వేరుగా ఉంటున్న వారు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే… పాత కార్డులో పేర్లు డిలీట్‌ చేసుకున్న వెంటనే కొత్త కార్డు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు.

కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సబ్‌ కమిటీ చర్చించింది. 10 రోజుల్లో 4 లక్షల 97 వేల కార్డుల జారీపై సీఎం కేసీఆర్‌కు తుది నివేదిక ఇవ్వనున్నారు. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులపై కూడా చర్చించారు. డీలర్లకు కమిషన్ పెంపు ప్రతిపాదనపై కూడా కమిటీ చర్చించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ప్లేస్ లో స్మార్ట్ రేషన్ కార్డ్ లు ఇచ్చే అంశాన్ని పరిశీలించారు. లబ్ధికారులు తీసుకున్న రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు వినూత్న పధకానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది.