Telangana High Court : నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు కొత్తగూడెనికి చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యింది. నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Telangana High Court : నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. హైకోర్టు ఆగ్రహం

Telangana High Court

Telangana High Court : తెలంగాణ హైకోర్టు కొత్తగూడెనికి చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యింది. నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యక్తిపై హైకోర్టు ఆ స్థాయిలో మండిపడటానికి కారణం అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడమే, అతడి వ్యవహార శైలి. మంగళవారం(జూన్ 22,2021) ఈ అప్పీలును విచారిస్తున్న క్రమంలో గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లోని వివరాలను ఉటంకిస్తూ అతడిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అధికార పార్టీ అండ చూసుకుని పిటిషనర్‌ వాస్తవాలను తొక్కిపెట్టారని, అధికారులను బెదిరించారని, న్యాయవాదిపై భౌతికదాడులకు పాల్పడ్డారని సింగిల్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఎంత బలవంతుడివో మేమూ చూస్తాం, ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తాం’’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌ గ్రామ పంచాయతీలోని 1,200 చదరపు గజాల స్థలంలో వి.గోపాల్‌రావు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టారు. అది అక్రమ నిర్మాణమని తేల్చిన పంచాయతీ.. ఏప్రిల్‌ 21న కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గోపాల్‌రావు పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి దానిని కొట్టివేశారు. అనుమతులను తిరస్కరిస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని సవాలు చేయకపోవడంతో పాటు హైకోర్టులో ఉన్న మరో పిటిషన్‌ వివరాలను తొక్కిపెట్టడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు.

ఈ వ్యవహారంపై కలెక్టర్‌, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించారు. ‘‘మీ (గోపాలరావు)పై చర్య తీసుకోవడానికి జిల్లా పంచాయతీ అధికారి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి, తదితరులను బదిలీ చేయించారు. అక్రమ నిర్మాణంపై ఓ వ్యక్తి పిటిషన్‌ వేయగా ఆయన న్యాయవాదిని బెదిరించారు. ఉపసంహరించుకోవడానికి నిరాకరించడంతో భౌతిక దాడులకు పాల్పడ్డారు. బలవంతంగా ఎన్వోసీపై సంతకం తీసుకున్నారు. మరో న్యాయవాది వస్తే ఆయన్నూ బెదిరించారు’’ అని చెబుతూ గోపాలరావు పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై గోపాలరావు దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం గోపాలరావు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అంత బలవంతుడైతే ఈ వ్యవహారాన్ని మేమే పర్యవేక్షించాల్సి ఉందని అంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో తెలిపిన అంశాలపై వివరణ ఇవ్వాలని గోపాలరావును ఆదేశించిన కోర్టు.. విచారణను జూన్ 29కి వాయిదా వేసింది.