Telangana : తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు
తెలంగాణలో నిరర్ధక భూములను అమ్మేందుకు సిద్ధమైన సర్కార్.. మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే ఖజానాకు ఆదాయం రావడంతో పాటు రియల్ ఎస్టేట్ బ్లాక్ దందాకు కూడా చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Telangana : తెలంగాణలో నిరర్ధక భూములను అమ్మేందుకు సిద్ధమైన సర్కార్.. మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే ఖజానాకు ఆదాయం రావడంతో పాటు రియల్ ఎస్టేట్ బ్లాక్ దందాకు కూడా చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కరోనాతో ఖజానాకు భారీగా గండి పడటంతో కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మకానికి పెట్టింది. కోకాపేట్ , ఖానామెట్ లోని 64 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలని నిర్ణయించింది. ఈ-వేలం ద్వారా పారదర్శంగా భూములను విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16 వందల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తాజాగా భూముల మార్కెట్ విలువ పెంచి మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు సర్కార్ రెడీ అయింది. భూములు మార్కెట్ వ్యాల్యూపై త్వరలోనే అడిషనల్ కలెక్టర్ల నేతృత్వంలో కమీటీని వేయనుంది. ఈ కమీటీలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్టార్, మున్సిపల్ కమీషనర్ లు సభ్యులుగా ఉంటారు. ఇక హైదరబాద్ లో హెచ్ఎండీఏ కమీషనర్ సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ వ్యవసాయ భూములు, పట్టణాలు, నగరాలు, హైవే పక్కనున్న భూములు, కమర్షియల్ బిట్స్, అపార్ట్మెంట్ ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించనుందని సమాచారం.
ప్రస్తుతం భూముల రేట్లకు, ప్రభుత్వ మార్కెట్ వాల్యూకు చాలా తేడా ఉంది. ఇది రియల్టర్ల బ్లాక్ దందాకు కారణమవుతుందని సర్కార్ భావిస్తుంది. దీంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ద్వారా ఖజానాకు వచ్చే రాబడి తగ్గుతుంది. ఎనిమిదేళ్ల క్రితం సవరించిన భూముల మార్కెట్ వాల్యూను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పట్టణాలలో 50 శాతం లాండ్ వ్యాల్యూ పెంచనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాలలో 30 శాతం.. వ్యవసాయ భూములపై 20 శాతం,, వ్యవసాయేతర భూములపై 40 నుంచి 50 శాతం మార్కెట్ వ్యాల్యూ పెంచాలని సర్కార్ భావిస్తుంది. ఇందుకు సంబంధించి రేపోమాపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.