Minister Gangula Kamalakar : వైఎస్సార్ కుటుంబాన్ని విడదీసింది సజ్జలే, జగన్ ప్రభుత్వం విఫలమైంది-తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అనవసరంగా తెలంగాణతో పెట్టుకుని గోక్కోవద్దని సజ్జలకు సూచించారు మంత్రి గంగుల. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.
Minister Gangula Kamalakar : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోమారు మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఏపీలో టీచర్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తోందని వైసీపీ సర్కార్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై ఏపీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు ఎదురుదాడికి దిగారు. ఘాటుగా బదులిచ్చారు. కేసీఆర్తో హరీశ్ రావుకు విభేదాలుంటే వాళ్లే పరిష్కరించుకోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. సజ్జలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అనవసరంగా తెలంగాణతో పెట్టుకుని గోక్కోవద్దని సజ్జలకు సూచించారు మంత్రి గంగుల. టీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబం లాంటిదని చెప్పారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు ఉన్నాయని మీరెలా అంటారని నిలదీశారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే 2014లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని సూచించారు మంత్రి గంగుల.
సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు సలహాదారుడు అని, సలహాలు ఏమైనా ఉంటే జగన్ కే ఇచ్చుకోవాలన్నారు. సజ్జల సలహాలు తెలంగాణ లీడర్లకు అవసరం లేదన్నారు. సజ్జలవి విడదీసే రాజకీయాలని ఫైర్ అయ్యారు. జగన్ కుటుంబంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని విమర్శించారు. ఇంకోసారి తెలంగాణ గురించి అనవసరంగా మాట్లాడితే కథ వేరేలా ఉంటుందని వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చారు మంత్రి గంగుల.
”హరీశ్ రావు మా ఆస్తి. మామా అల్లుళ్ల మధ్య చిచ్చు పెడతావా? కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరు. సజ్జల జగన్ కు సలహాలు ఇవ్వాలి. మాకు కాదు. మా జోలికొస్తే బాగుండదు. మళ్లీ మీ మీద దాడి చేసే రోజు వస్తుంది. తెలంగాణ జోలికొస్తే ఊరుకునేది లేదు. సజ్జలవి విడదీసే రాజకీయాలు. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసు. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? జగన్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది. తెలంగాణ జోలికి కానీ, మా ప్రభుత్వం జోలికి కానీ, మా మంత్రుల జోలికి కానీ రావొద్దు. తెలంగాణతో పెట్టుకుంటే 2014 రిపీట్ అవుతుంది” అని సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
”పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబాన్ని సజ్జల విచ్ఛిన్నం చేశారు. తల్లిని కొడుకును విడదీసిన సజ్జల… అన్నను, చెల్లిని కూడా విడదీశారు. వైఎస్సార్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన సజ్జల.. ఇప్పుడు పచ్చని సంసారంలా సాగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని విడదీయడానికి యత్నిస్తున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీని విడదీసినట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని సజ్జల విడదీయలేరు.
2014కు ముందు అసలు సజ్జల అంటే ఎవరికి తెలుసు? రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరిన సజ్జల… ఆ పార్టీని ఉడుములా పట్టేశారు. అసలు తెలంగాణ వ్యవహారాలతో మీకేం సంబంధం? దేశంలోనే తెలంగాణ పథకాలు మంచిగా ఉన్నాయని చెబుతున్నామని, ఆ క్రమంలోనే ఇతర రాష్ట్రాల పేర్లను, పొరుగు రాష్ట్రాల పేర్లను ప్రస్తావిస్తున్నాం. అయినా వైసీపీ పాలన బాగుంటే… హరీశ్ వ్యాఖ్యలతో సజ్జల ఎందుకు ఉలిక్కిపడతారు? టీఆర్ఎస్ సత్తా ఏమిటో మరోమారు చూపించాలంటే అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 2014కు ముందు ఉద్యమంలోనే చూపించాం. ఇకనైనా మాతో పెట్టుకోవద్దు” అని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు గంగుల.
ఇటీవల ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అభివృద్ధి, టీచర్లకు సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వివాదం వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సజ్జలను ఉద్దేశించి తాజాగా మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.