TS Dalitha bandhu Scheme : దళితబంధు గురించి ప్రశ్నించిన మహిళలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం .. వాళ్లను బయటకు పంపేయండంటూ హుకుం
దళితబంధు గురించి ప్రశ్నించిన మహిళలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం ..\ఆ ప్రశ్నించే మహిళలకు బయటకు పంపేయండంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు.
TS Dalitha bandhu Scheme : దళిత బంధు పథకం తమకు రావటంలేదంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మహిళలు ప్రశ్నించారు.నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చసేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొంతమంది మహిళలు ప్రశ్నించారు. దీంతో మంత్రిగారు ఆగ్రహం వ్యక్తంచేశారు సదరు మహిళలపై. ‘మా ఇష్టం వచ్చినవారికి దళిత బంధు ఇస్తాం..అడగటానికి మీరెవరు?నన్నే ప్రశ్నిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు తనను ప్రశ్నించిన మహిళలను బయటకు తీసుకెళ్లిపొమ్మంటూ అక్కడే ఉన్న పోలీసులకు ఆదేశించారు. దీంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దళిత బంధు పథకం ఇస్తాం అని..దళితులను ఉద్ధరించే ప్రభుత్వం మాది అని చెప్పుకునేవారు ఇలాగే మాట్లాడేది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం జనాలకు ఇస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది అంటూ చులకన చేసి మాట్లాడారు మంత్రి.
‘‘మీకు ఓపిక లేకుంటే మేం ఏం చేయాలి. ఏ ఊకుండమ్మా.. నువ్వు మాట్లాడకు. మా ఇష్టమొచ్చినొళ్లకు ఇచ్చుకుంటాం. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు..మీలాంటోళ్లు ఇక్కడుండొద్దు బయటకు తీసుకుపోండి.. పో బయటకు పో.. ’’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చేది ఎక్కువైతే ఇట్లనే ఉంటది..నీకు పది లక్షల రూపాయలు ఇస్తే ఏం చేస్తావో చెప్పు ముందు అంటూ హేళన చేసి మాట్లాడారు మంత్రి. మీకు అనుభవం ఏం ఉండి.. ఏం చేసుకుని బతుకుతవో చెబితేనే దళిత బంధు ఇస్తాం అంటూ నీతులు చెప్పారు మంత్రి. ఎవరి దగ్గర తిరుగుతున్నారో వాళ్ల దగ్గరికే వెళ్లండి.. వాళ్లే ఇస్తారంటూ మండిపడ్డారు.
ఇటీవల మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం అజ్జమర్రి గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా.. కల్యాణ లక్ష్మి డబ్బులు రావటంలేదని వాపోయినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యువకుడు.. కల్యాణ లక్ష్మి ‘పైసలు రావట్లేదని ఇలా చాలామందికి రాలేదంటూ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అతడిని వెంటనే లోపల వేయాలని పోలీసులకు చెప్పారు. ఇలా ప్రభుత్వం పథకాల గురించి ప్రశ్నిస్తే నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.