KTR : మార్పులు అవసరం.. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు కేటీఆర్ లేఖ

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల్ల కలుగుతున్న ఫలితాలు,

KTR : మార్పులు అవసరం.. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు కేటీఆర్ లేఖ

Ktr Letter

KTR Letter : కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల్ల కలుగుతున్న ఫలితాలు, సమస్యలను నిర్మలా సీతారామన్ దృష్టికి తన లేఖ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కేటీఆర్.

”గతేడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి త్వరలోనే కరోనా మూడవ దశ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజీని మరోసారి పునర్ నిర్వచించడం ద్వారా ఈ కరోనా సంక్షోభం ద్వారా ప్రభావితమైన వివిధ రంగాలు, ముఖ్యంగా అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్ఎంఈ రంగానికి మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుంది.

ఈ దిశగా కేంద్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకుంటుందని, కేంద్రం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నా” అని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.

రాబ‌డుల‌ను పూర్తిగా కోల్పోయాం:
కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు గౌరవ ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తోంది. తెలంగాణ రాష్ట్ర తయారీ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ. మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ వచ్చాను. అయితే కరోనా సంక్షోభం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ఇక్కడి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మీరు ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు అత్యంత కనిష్టంగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న 80 శాతానికిపైగా ఎంఎస్ఎంఈలు లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, 25 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోవడం జరిగింది.

ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన పిఎల్ఐ పథకం ద్వారా దేశంలోని ఎంఎస్ఎంఈల పై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పథకం కేవలం పెద్ద తయారీ కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉంది. దేశీయ ఎంఎస్ఎంఈలతో కూడిన ఒక సప్లయ్ చైన్ ఏర్పాటు చేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించడం ద్వారా పిఎల్ఐ ప్రయోజనాలను ఆయా ఎంఎస్ఎంఈలతో పంచుకునేలా ఈ కార్యక్రమం మార్గదర్శకాలను మార్చవలసిన అవసరం ఉందని ” కేటీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు.