Telangana MLC polls : టీఆర్ఎస్‌కు మోదం, బీజేపీకి ఖేదం

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు.

Telangana MLC polls : టీఆర్ఎస్‌కు మోదం, బీజేపీకి ఖేదం

Trs

Vani Devi Win : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారామె. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను (హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం – వరంగల్ – నల్గొండ) సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా..బీజేపీ సిట్టింగ్ స్థానమైన..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో విజయం సాధించే దిశగా పక్కా స్కెచ్ రచించారు. ముందునుంచే ప్రణాళికలతో ముందుకెళ్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కేడర్ ను నైరాశ్యంలో ముంచెత్తాయి. ఈ క్రమంలోనే..ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిని అధిగమించాలని టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. అందులో భాగంగా..అనూహ్యంగా..మాజీ ప్రధాని, దివంగత పీవీ కుమార్తె సురభి వాణీదేవిని ఎన్నికల బరిలో దింపింది. ఈమె గెలుపునకు పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా..కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వారీ వారీ ప్రాంతాల్లో ఓటర్లను స్వయంగా కలుసుకున్నారు. 25 మంది ఓటర్లకు స్థానిక నేతను ఇన్ ఛార్జీగా నియమించింది టీఆర్ఎస్ అధిష్టానం. ఎక్కడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా..సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లింది. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచే అడుగులు వేసింది. అందరి చేత ఓటర్లుగా నమోదు చేపట్టింది.

కేంద్రం, బీజేపీపై దాడి పెంచారు నేతలు. కేంద్రం అమలు చేస్తున్నవి..రాష్ట్రంలో అమలు చేపడుతున్నవి ఓటర్లకు వివరించడంలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగులకు మరోసారి వరాలు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పడం కలిసి వచ్చినట్లు చెప్పవచ్చు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించడంతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఓటర్లు సానుకూలంగా స్పందించారని చెప్పవచ్చు. ఏడేళ్లుగా..ప్రభుత్వం చేసిన పథకాలను విసృతంగా తీసుకెళ్లింది. భవిష్యత్తులో జరిగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వాణీదేవికి మంత్రిపదవి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇవి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలే అయినప్పటికీ ఆరు ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకున్నట్లయ్యింది. మొత్తంగా..వ్యూహాలు సక్రమంగా అమలు కావడంతో..ఆశించిన ఓట్లను సాధించింది.