కరోనాకి ఔషధాలు కనుగొన్న తెలంగాణ బిడ్డ

  • Published By: murthy ,Published On : November 23, 2020 / 08:42 AM IST
కరోనాకి ఔషధాలు కనుగొన్న తెలంగాణ బిడ్డ

Telangana scientist in US finds potential Covid cure : కరోనా పై పోరులో భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త, తెలంగాణలోని వరంగల్ కు చెందిన కన్నెగంటి తిరుమల దేవి గొప్ప ఆవిష్కరణ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని కబళిస్తున్న కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు సమర్థ చికిత్స విధానాన్ని కనుగొన్నారు. టెన్నెసీ రాష్ట్రంలోని సెయింట్‌ జూడ్‌ చిల్ర్డెన్స్‌ రిసెర్చ్‌ ఆస్పత్రి ఇమ్యునాలజీ విభాగం వైస్‌-చైర్‌ హోదాలో సేవలు అందిస్తున్న ఆమె నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ఘనత సాధించింది.

కరోనా రోగులకు ప్రాణాంతకంగా పరిణమించే వాపు (ఇన్‌ఫ్లమేషన్‌), ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవాల వైఫల్యాన్ని నిరోధించే మార్గాన్ని గుర్తించారు. ‘ఇన్‌ఫ్లమేటరీ సెల్‌ డెత్‌’ ఎలా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా అడ్డుకోవచ్చన్నది కనుగొన్నారు.



కొవిడ్‌-19తో ముడిపడి ఉన్న ‘హైపర్‌ ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌’.. కణజాలం దెబ్బతినేందుకు, భిన్న అవయవాల వైఫల్యానికి దారితీస్తున్నట్టు గుర్తించారు. ఇన్‌ఫ్లమేటరీ సెల్‌డెత్‌ పాత్‌వేస్‌ ద్వారా దీన్ని గుర్తించారు. తద్వారా ఆ ప్రక్రియను బ్రేక్‌ చేసే చికిత్స విధానానికి మార్గం సుగమం చేశారు.
https://10tv.in/over-3600-people-penalised-in-3-days-for-not-wearing-mask-noida-police/
ఇన్‌ఫ్లమేటరీ సెల్‌డెత్‌ పాత్‌వేస్‌ను యాక్టివేట్‌ చేసే ప్రత్యేక సైటోకైన్లను తాము గుర్తించామని, కొవిడ్‌తోపాటు సెప్సిస్‌ తరహా వ్యాధులకు అడ్డుకట్ట వేసే సామర్థ్యం వీటికి ఉన్నదని తిరుమలదేవి చెప్పారు. ఈ అధ్యయన వివరాలు సెల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.



ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించి వైర్‌స్/బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు, వివిధ రోగ నిరోధక కణాలను విడుదల చేయడం సహజ పరిణామమే. అయితే రోగ నిరోధక కణాలు ఇన్ఫెక్షన్‌ సోకిన ప్రదేశం, రోగకారక క్రిమికి సంబంధించిన సమాచారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు విడుదల చేసే సిగ్నలింగ్‌ ప్రొటీన్లే సైటోకైన్లు. రోగ నిరోధక కణాలు ఎన్నో రకాల సైటోకైన్లను విడుదల చేస్తుంటాయి. అయితే తిరుమలదేవి నేతృత్వంలోని పరిశోధక బృందం ప్రత్యేకించి.. కొవిడ్‌-19 రోగులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న టీఎన్‌ఎ్‌ఫ-ఆల్ఫా, ఐఎ్‌ఫఎన్‌-గామా అనే సైటోకైన్ల పనితీరుపై అధ్యయనం చేసింది.

నిరోధక వ్యవస్థ ప్రాణాంతకంగా మారినప్పుడు..
మన రోగనిరోధక వ్యవస్థ అవసరానికి మించి చురుగ్గా మారినప్పుడు, అది వ్యాధులతో పోరాటం చేయడానికి బదులు మన శరీరానికే నష్టం కలిగిస్తుంది. ఆ సమయంలో సైటోకైన్లు ఒక తుఫానులా వచ్చి పడతాయి. దీనినే సైటోకైన్‌ స్టార్మ్‌ అంటారు. రక్తంలో పెద్దసంఖ్యలో సైటోకైన్లు పేరుకు పోతాయి.



దీని వల్ల వాపు, ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవాల వైఫల్యం జరిగే ప్రమాదమున్నది. కొవిడ్‌-19తోపాటు మరికొన్ని వ్యాధులలో ఇది జరుగుతున్నది. అయితే ఈ సైటోకైన్‌ స్టార్మ్‌కు గల కారణమేంటన్నదానిపై స్పష్టతలేదు.

ఈ నేపథ్యంలో తిరుమలదేవి బృందం కొవిడ్‌-19 రోగుల్లో ప్రత్యేక సైటోకైన్లపై దృష్టిసారించింది. అయితే ఇమ్యూన్‌ కణాల మృతికి సింగిల్‌గా ఏ సైటోకైన్‌ కారణం కాదని గుర్తించారు. ఈ నేపథ్యంలో 28 రకాల సైటోకైన్‌ కాంబినేషన్లపై వారు పరిశోధన చేశారు. టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా, ఐఎన్‌ఎఫ్‌ గామా వల్లే కణాలు మృతిచెందినట్లు గుర్తించారు. ఈ సైటోకైన్‌ కాంబినేషన్‌ లక్ష్యంగా చేసుకునే థెరపీలు కొవిడ్‌తోపాటు సైటోకైన్‌ స్టార్మ్‌తో ముడిపడి ఉన్న ఇతర వ్యాధులకు చికిత్స అందించేందుకు దోహదపడుతాయని పరిశోధకులు తెలిపారు.



కాగా, డాక్టర్‌ కన్నెగంటి తిరుమలదేవి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1972 అక్టోబరు 18న జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలోనే డిగ్రీ (బీజెడ్‌సీ) పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అందుకున్నారు. అనంతరం 2007లో అమెరికాలోని టెన్నెసీలో ఉన్న సెయింట్‌ జూడ్‌ చిల్ట్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం దానికి వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

ఆమె పరిశోధక బృందంలో ఆమెతో పాటు తెలంగాణకు చెందిన బానోతు బాలాజీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌.కె.సుబ్బారావు మలిరెడ్డి, పరిమళ్‌ సమీర్‌ (మధ్యప్రదేశ్‌), బాలమురుగన్‌ సుందరం (తమిళనాడు), శ్రద్ధ తులాధర్‌,ప్యాట్రిక్‌ స్క్రీనర్‌, జాఫ్రీ నియాల్‌, పీటర్‌ వోగెల్‌, రిచర్డ్‌ వెబ్బీ, మిన్‌ జెంగ్‌ లు ఉన్నారు.