డీడీసీఎఫ్ కేసులో తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్ : ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ఇచ్చిన జీవో కొట్టివేత
డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.
High Court shock to the Telangana government : డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది. ఇంతకీ ఏపీ, తెలంగాణల మధ్య ఏళ్లుగా సాగుతున్న ఆ వివాదమేంటి? డీడీసీఫ్ ఆస్తుల పంపకంపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించింది. హైదరాబాద్లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
సోమాజిగూడలోని హెడ్క్వార్టర్, లాలాపేట్లోని యూనిట్ ఆస్తులను.. ఏపీ, తెలంగాణ మధ్య 58:42 నిష్పత్తిలో పంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తుల విలువ కట్టడానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సహాయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రెండు ప్రభుత్వాలకు సూచించింది. ఆస్తుల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. డీడీసీఎఫ్ ఆస్తుల పంపకాలను మూడు నెలల్లో పూర్తిచేయాలని.. పంపకాలు పూర్తయ్యే వరకు బ్యాంకు ఖాతాలు ఆపరేట్ చేయవద్దన్న ఆదేశించింది.
ఏపీఎస్డీడీసీకి చెందిన ప్రధాన యూనిట్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం 2016మే 6న జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు పిటీషన్ వేసింది. ఏపీఎస్డీడీసీ.. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యుల్లో ఉంది. ఆస్తుల పంపకాలు మాత్రం జరగలేదు. దానిపై కేంద్రం నిర్ణయం వెలువడక ముందే.. ఆస్తుల స్వాధీనం జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయితే, ఏపీలో ఉన్న ఆపరేషనల్ యూనిట్లపై తాము ఎటువంటి క్లెయిమ్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది.
విభజన చట్టం ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే.. కేంద్రం జోక్యం చేసుకుని, తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు. కానీ, కేంద్రప్రభుత్వం 2016 నుంచి దానిపై ఎటువంటి కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ధర్మాసనం రెండు రాష్ట్రల పంపకాల్లో కేంద్రం అవసరం లేదని తెలిపింది. సోమాజిగూడలోని హెడ్క్వార్టర్, లాలాపేట్లోని యూనిట్ ఆస్తులను.. ఏపీ, తెలంగాణ మధ్య 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని తీర్పును వెల్లడించింది.