highest temperatures : తెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణలో వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చ్ నెలలోనే సూర్యుడు భగ భగ మండిపోతున్నాడు.
The highest temperatures recorded : తెలంగాణలో వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చ్ నెలలోనే సూర్యుడు భగ భగ మండిపోతున్నాడు. గత రెండు, మూడు రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
శుక్రవారం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన గాలి విచ్ఛిన్నతి క్రమంగా బలహీనపడుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత భద్రాచలంలో 40,2 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 18.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యాయని వాతావరణశాఖ పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 24 డిగ్రీలు నమోదైంది. మార్చి నెలలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే 1.2 డిగ్రీలు అధికం. తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని, రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఒకట్రెండు రోజుల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు.
మార్చిలోనే సూర్యుడు కన్నెర్ర చేస్తుంటే…. రానున్న రెండు నెలల్లో ఎండలను తలచుకుంటేనే భయమేస్తోంది. మండుటెండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకూ ఉంటున్నాయ్. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ హెచ్చరికలతో ప్రజలు హడలిపోతున్నారు. ఓ వైపు నేల నిప్పుల కుంపటిని తలపిస్తోంటే.. మరోవైపు ఉక్కపోత ఊపిరి సలపకుండా చేస్తోంది. సింగరేణి పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి.