Telangana: తెలంగాణ ఆదాయం రూ. 24,629 కోట్లు

ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్న ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ప్రభుత్వం చెబుతోంది.

Telangana: తెలంగాణ ఆదాయం రూ. 24,629 కోట్లు

Telangana

Telangana: ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్న ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2021-22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగినట్లుగా ప్రకటించింది. 2020-21 తొలి త్రైమాసికం (క్యూ1)లో వచ్చిన ఆదాయం కంటే 67 శాతానికిపైగా ఆదాయం, మొత్తం రూ.24,629 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు అధికారులు.

2021కి సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో ఆశించినంత ఆదాయం రాలేదు. ముఖ్యంగా మేలో రాబడి గణనీయంగా తగ్గినప్పటికీ, త్రైమాసికం చివరినాటికి ఆదాయం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరులో సెకండ్‌ వేవ్‌ వల్ల రూ.8,054 కోట్లుగా ఆదాయం మాత్రమే రాగా.. మేలో లాక్‌డౌన్‌ వల్ల రూ.6,364 కోట్లు మాత్రమే వచ్చింది. జూన్‌లో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేయడంతో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాక ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలిసారి జూన్‌లో ఆదాయం రూ.10 వేల కోట్ల మార్కు దాటింది. ఆ నెలలో మొత్తం రూ.10,222 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా మూడు నెలల్లో కలిపి ఖజానాకు రూ.24,629 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది బడ్జెట్‌ అంచనాల్లో 13.98 శాతం.

గతేడాది కంటే మెరుగ్గా ఈ పరిస్థితి ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గతేడాది కరోనా ఆంక్షలు ఎక్కువగా ఉండగా.. తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఖజానాకు రూ.14వేల 722 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇది బడ్జెట్‌ అంచనాల్లో 10.28 శాతం. ఈసారి సెకండ్‌వేవ్‌ ఇబ్బంది ఉన్నా కూడా గతేడాది తొలి త్రైమాసికం కంటే అదనంగా రూ.9,907 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 67% పెరుగుదల కనిపించింది.