young man blackmail girl : ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ ఇస్తే…బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్
ఆన్లైన్ చదువుల కోసం తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్ ఫోన్ను ఓ విద్యార్థి దుర్వినియోగపరిచాడు. ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేశాడు.
young man blackmailed girl : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడంతో తెలంగాణలో విద్యా సంస్థలను మూసివేశారు. అయితే అన్ లైన్ క్లాసులు మాత్రం నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ చదువుల కోసం తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్ ఫోన్ను ఓ విద్యార్థి దుర్వినియోగపరిచాడు. ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేశాడు. పోలీసులు కథనం ప్రకారం… మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ముడుచింతలపల్లి మండలం, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కరోనా నేపథ్యంలో కాలేజీ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా, తల్లిదండ్రులు అతనికి స్మార్ట్ ఫోన్ ఇప్పించారు. పిల్లలకు తరగతుల సమాచారం కోసం తయారు చేసిన వాట్సాప్ గ్రూప్లో తనతో పాటు పాఠశాలలో చదువుకున్న ఓ బాలిక ప్రొఫైల్ ఫొటో చూశాడు. అదే క్రమంలో ఆమెకు మెసేజ్ పంపించాడు. ఇందుకు ఆమె స్పందించలేదు. పదే పదే మెసేజ్లు రావడంతో అతడి నంబర్ ను బ్లాక్ చేసింది.
దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి బాలిక ఫొటోతో ఉన్న ప్రొఫైల్ పిక్చర్ను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఆ ఫొటోను ఫేస్యాప్ ఎడిటర్ సాయంతో నగ్న చిత్రాలకు జోడించి ఆమెకు పంపించాడు. అనంతరం న్యూడ్ వీడియో కాల్ చేయాలంటూ, లేకుంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఇతర గ్రూప్లకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు.
బాధితురాలు కుటుంబ సభ్యుల సాయంతో సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టిన పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పోకో, మోటో జీ5 ఎస్ ప్లస్ మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 354డి, 509, 201 ఐపీసీ, సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్, 67ఏ ఆఫ్ ఐటీ యాక్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కింద కేసు నమోదు చేశారు.