CM KCR Speech: ఆంధ్రాలో పార్టీ పెట్టమని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారు
రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, గులాబీ పండుగ హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
CM KCR Speech: రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, గులాబీ పండుగ హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాగత తోరణాలతో గులాబీమయం అయి ప్లీనరీలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, మన పథకాలను ఇతర రాష్ట్రాలే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొట్టే పరిస్థితికి వచ్చామని అన్నారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి మన రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లో అనేక గ్రామాలు తెలంగాణలో మమ్మల్ని కలపండి అనే పరిస్థితికి వచ్చారని అన్నారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్ర రాష్ట్రం నుంచి వేల మంది ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటాం అని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు కేసీఆర్. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని, తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని కూడా కలపాలని కోరుతూ నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయని, ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి రాష్ట్రంలో పనిచేసుకుంటున్నారని అన్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు కేసీఆర్.