దత్తత ఇచ్చిన తల్లిదండ్రులే కిడ్నాప్ చేశారు.. మగబిడ్డ కావడమే కారణమా.. ములుగు జిల్లాలో శిశువు కిడ్నాప్‌ కలకలం

  • Published By: naveen ,Published On : October 24, 2020 / 12:26 PM IST
దత్తత ఇచ్చిన తల్లిదండ్రులే కిడ్నాప్ చేశారు.. మగబిడ్డ కావడమే కారణమా.. ములుగు జిల్లాలో శిశువు కిడ్నాప్‌ కలకలం

three months old boy kidnap in mulugu: కన్నపేగుపై మమకారం గుర్తొచ్చిందా.. మూడు నెలల తర్వాత తమ బిడ్డ తమకు గుర్తొచ్చాడా..? అడిగితే ఇవ్వరనుకునే కిడ్నాప్‌కు పాల్పడ్డారా..? పుట్టినప్పుడు బిడ్డపై కలగని ప్రేమ.. మూన్నెళ్ల తర్వాత కలిగిందా..? మరి పురిట్లో బిడ్డను మూడు నెలలుగా సొంత బిడ్డలా చూసుకుంటున్న దత్తత తల్లి సంగతేంటి..? కారం, కత్తులతో దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అప్పుడు బిడ్డను కాదన్న పెద్దలు.. మళ్లీ ఇప్పుడు ఎందుకు బిడ్డను వెనక్కి తీసుకు రమ్మన్నట్లు..? మగబిడ్డ కాబట్టే.. తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారా..? దత్తత ఇచ్చిన వారే కిడ్నాపర్లుగా ఎందుకు మారారు..? అసలు ములుగు జిల్లాలో అర్థరాత్రి కలకలం సృష్టించిన కిడ్నాప్‌లో మిస్టరీ ఏంటి..? ఓ వైపు దత్తత తల్లి.. మరోవైపు కన్న తల్లి మధ్య ఈ కిడ్నాప్‌ స్టోరీ ఇద్దరు తల్లుల కథలా మారుతోంది.

ఇంట్లో వద్దన్నారని బాబుని దత్తత ఇచ్చేశారు:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగిన కిడ్నాప్‌లో.. సవాలక్ష ప్రశ్నలు వెంటాడుతున్నాయి. దత్తతకు అగ్రిమెంట్‌ రాసిచ్చిన వారే.. మళ్లీ తమ బిడ్డను ఎత్తుకెళ్లడానికి రావడం చర్చనీయాంశమైంది. బాబు దత్తత తల్లి నాగేశ్వరి ఆరోపించినట్లు పసివాడి తల్లిదండ్రులే బిడ్డను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో కాదనడంతో స్నేహ-మహేందర్ దంపతులు నాగేశ్వరిని ఆశ్రయించారు. ఏడు నెలల గర్భిణిగా స్నేహ నాగేశ్వరి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు నాగేశ్వరీ ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తన తల్లిదండ్రులు బాబును తీసుకురావద్దంటున్నారని.. బాబును నాగేశ్వరికి స్నేహ – మహేందర్ దంపతులు దత్తత ఇచ్చేశారు. మూడు నెలల క్రితమే నాగేశ్వరికి బాలుడిని దత్తత ఇస్తున్నట్లు అగ్రిమెంట్‌ కూడా రాసిచ్చారు.

కిడ్నాపర్లు మారిన కన్నతల్లిదండ్రులు, కత్తులతో దాడి చేసి బిడ్డ అపహరణ:
అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇచ్చిన మాట కాదని తమ బిడ్డను ఎత్తుకెళ్లేందుకు తల్లిదండ్రులే ప్రయత్నించారు. మూడు నెలల తర్వాత తమ బిడ్డ తమకు గుర్తొచ్చాడో ఏమో.. బాబు తల్లిదండ్రులే మూకుమ్మడిగా కిడ్నాపర్లుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కారం, కత్తులతో దాడి చేసి మరీ బిడ్డను ఎత్తుకెళ్లాలనుకున్నారు. కన్నపేగుపై మమకారం గుర్తొచ్చి.. కర్కశత్వంగా ప్రవర్తించారు. పుట్టిన బిడ్డను పురిట్లోనే వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులకు.. ఇప్పుడే తమ బిడ్డ ఎందుకు గుర్తొచ్చాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మగబిడ్డ కాబట్టే తీసుకెళ్లేందుకు వచ్చారా.. అదే ఆడబిడ్డ అయితే పరిస్థితులు ఎలా ఉండేవనే సందేహాలూ పుట్టుకొస్తున్నాయి.

అర్థరాత్రి వేళ.. సినీ ఫక్కీలో మూడు నెలల బాబు కిడ్నాప్‌:
అర్థరాత్రి వేళ.. సినీ ఫక్కీలో మూడు నెలల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే తరహాలో స్థానికులు కూడా కిడ్నాపర్లను చేజ్ చేసి పట్టుకున్నారు. తరువాత వాహనాన్ని, కిడ్నాపర్లను, బాలుడిని పోలీసులకు అప్పగించారు. అయితే బాబు తమకు కావాలంటూ.. గత అర్ధరాత్రి తనపై కారం, కత్తులతో దాడి చేసేందుకు యత్నించారని నాగేశ్వరి చెబుతోంది. బాలుడిని ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు అప్రమత్తమై నిందితులను యోగితానగర్ సమీపంలో పోలీసుల సాయంతో పట్టుకున్నారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాబును నాగేశ్వరికి అప్పగించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబు తల్లిదండ్రులే బిడ్డను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు.