Telangana : గవ‌ర్న‌ర్ తమిళిసైతో టీపీసీసీ నేతల భేటీ..11 అంశాలపై ఫిర్యాదు

గవ‌ర్న‌ర్ తమిళిసైతో టీపీసీసీ నేతలు సమావేశమయ్యారు. 11 అంశాలపై ఫిర్యాదు చేశారు.

Telangana : గవ‌ర్న‌ర్ తమిళిసైతో టీపీసీసీ నేతల భేటీ..11 అంశాలపై ఫిర్యాదు

Tpcc Meets Governer (1)

Telangana :  తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్‌తో టీపీసీసీ కీల‌క‌ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. గవర్నర్ కు 11 అంశాలపై ఫిర్యాదులు చేశారు. తెలంగాణ‌లో పెరిగిపోతున్న నిరుద్యోగం, 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ‌డం, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, తదితర అంశాలపై గవర్నర్‌కు టీపీసీసీ నేత‌లు ఫిర్యాదు చేసారు. వీటిపై గవర్నర్ సమీక్ష జరపాలని కోరారు. వరి పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఈ సందర్భంగా టీపీసీసీ నేతలు పేర్కొన్నారు.

ధాన్యం మొత్తం తెలంగాణ‌ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నిన్న సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దాని కోసం వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాల‌ని, మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా గ‌వ‌ర్న‌ర్‌కు టీపీసీసీ నేత‌లు వినతి పత్రం సమర్పించారు.

ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ నేత‌లు సమావేశమై పలు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సీఎల్పీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ప్ర‌యోజ‌నాల కోసం త‌మ‌ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని స్పష్టం చేశారు. ప్ర‌భుత్వం ధాన్యానికి సంబంధించి చివ‌రి గింజ కొనేవ‌ర‌కు త‌మ‌ పోరాటం ఆగ‌దని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే త‌క్కువ ధ‌ర‌ల‌కు వ‌రి అమ్మి న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు ఇత‌ర పంట‌లు వేసి న‌ష్ట‌పోయిన వారికి కూడా ప‌రిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. 111 జీవోపై అఖిల‌ప‌క్ష భేటీ పెట్టాల‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్‌ను కోర‌తామ‌ని ఆయ‌న చెప్పారు. 111 జీవో ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ కోర‌తామ‌ని చెప్పారు. అలాగే, మూసీ ప్ర‌క్షాళ‌న‌పై గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రిస్తామ‌ని తెలిపారు. కాగా..గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, వి.హ‌నుమంత‌రావు తదితరులు ఉన్నారు.