Corporation Elections కార్పొరేషన్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్
తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు అధికార పార్టీ రెడీ అవుతోంది. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెల మొదటి వారంలో రెండు కార్పొరేషన్లతో పాటు.. 7 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
TRS Focus on Corporation Elections : తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు అధికార పార్టీ రెడీ అవుతోంది. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెల మొదటి వారంలో రెండు కార్పొరేషన్లతో పాటు.. 7 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోనూ పాగా వేసేందుకు గులాబీ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. మరి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహాలేంటి..?సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే లోపు మరోసారి రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది.
ఇప్పటికే ఎన్నికలు జరిగే పట్టణాల్లో వార్డుల డీ లిమిటేషన్ దాదాపు పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు. దీంతో ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాల్టీలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరంగా గుర్తింపు పొందిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు.. సిద్దిపేట సహా ఆరు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
అధికార పార్టీ రెండు కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టింది. ఖమ్మం, వరంగల్ స్థానాల్లో కచ్చితంగా విజయం దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయాలని చూస్తోంది. ఆయా జిల్లాల మంత్రులకు కార్పొరేషన్ల ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా డివిజన్ల వారిగా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించాలనుకుంటోందట గులాబీ పార్టీ. ఇక ఎన్నికలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. రెండు కార్పొరేషన్ ఎన్నికలపై నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
షెడ్యూల్ వెలువడిన వెంటనే అభ్యర్థులను ఖరారు చేయడం.. ప్రజాక్షేత్రంలో విపక్షాలకంటే ముందుగానే ప్రచారాన్ని మొదలు పెట్టడం లాంటి అంశాలపై పార్టీ దృష్టి సారించింది. డీ లిమిటేషన్ రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేయడంపై పార్టీ ఇప్పటికే పలు సర్వే నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎప్పట్లానే.. పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం కానుంది.