Huzurabad: హుజూరాబాద్పై టీఆర్ఎస్ ఫోకస్.. హాకీ ప్లేయర్కు కీలక పదవి!
Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని సీఎం ప్రకటించగా.. మరో పదవి కూడా హుజూరాబాద్ వాసికే దక్కింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్కు కీలక పదవి ఇచ్చారు. కొంతకాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్థి సంస్థ చైర్మన్గా బండా శ్రీనివాస్ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీనివాస్ది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్.. విద్యార్థి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్ఎస్లో చేరి… ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ మండల శాఖ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో పలు హోదాల్లో, ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగానూ శ్రీనివాస్ పనిచేశారు. హాకీ క్రీడాకారుడిగా రాణించిన ఆయన.. హాకీ క్లబ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండు మార్లు ఎన్నికయ్యారు.