Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి మీద దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
Minister Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై పోలీసులకు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై చెర్లు, బాటిల్స్, రాళ్లు, చెప్పులు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ శివారులో ఆదివారం(మే29,2022)సాయంత్రం నిర్వహించిన రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడి చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు.
తనపై జరిగిన దాడి ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి..తనను చంపటానికి యత్నిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి వెనక రేవంత్రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ రెడ్డి భావించి పక్కా ప్లాన్ ప్రకారమే తనపై రెడ్డి సభకు గూండాలను పంపించి దాడి చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నానన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడి చేయించాడని పేర్కొన్నారు.
తనపై దాడి చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని, దాడికి కుట్ర చేసిన రేవంత్ రెడ్డిని జైలుకు పంపించి తీరుతాను.. అంటూ మంత్రి మల్లారెడ్డి శపథం చేశారు. తాను ఇటువంటి దాడులకు భయపడే రకం కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని..కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను సభలో చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.