రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత, కేంద్ర మంత్రులను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

  • Published By: naveen ,Published On : September 12, 2020 / 02:52 PM IST
రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత, కేంద్ర మంత్రులను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రులు మాన్షుక్ మాండవియ, కిషన్ రెడ్డి ఫ్యాక్టరీని సందర్శించున్న నేపథ్యంలో.. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత పాల్గొన్నారు. కంపెనీ వల్ల నష్టపోతున్న స్థానికులకు ఉద్యోగాలు కేటాయించిన తర్వాతే.. ఇతరులకు ఉద్యోగాలు కేటాయించాలంటు నినాదాలు చేశారు.

ఎరువుల కర్మాగారం ముందు టీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కేంద్ర మంత్రుల కాన్వాయ్ లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు. భద్రత నడుమ కేంద్ర మంత్రులను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు హోరాహోరీ నినాదాలు చేశాయి.

తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీలో, నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇది వరకే తెలిపారు. కిసాన్ బ్రాండ్ పేరుతో రామంగుడం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిని తయారు చేయనుంది. ప్రత్యక్షంగా 460 మంది, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఉత్పత్తిలో 50 శాతం ఎరువులు తెలంగాణ రైతులకే దక్కనున్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన యూరియా సగం రాష్ట్రంలోనే పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 10లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. ఇప్పటి వరకు యూరియాను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీరనుంది. రూ.6,120.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కర్మాగారంలో రోజువారీగా 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది.

గతంలో మూతపడిన కర్మాగారం స్థానంలోనే గ్యాస్‌ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్ఎల్‌), ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సీఐల్‌)తో జాయింట్‌ వెంచర్‌గా ఈ ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీని చేపట్టారు. ఈ ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారా, నీటి వనరులను గోదావరి నది పై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుండి అందిస్తారు.

రామగుండం ఎఫ్‌సీఐ 1999 ఏప్రిల్ 1న మూతపడింది. 1980లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం ఆది నుంచే అనేక అవరోధాలను ఎదుర్కొంటూ 18 సంవత్సరాలు నడిచింది. రోజుకు 1500 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ యూనిట్ బొగ్గు కొరత, నష్టాల భారం, కార్మిక సమస్యల కారణంగా మూతపడింది. ప్రారంభ సమయంలో 3వేల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభమైంది. అయితే కేవలం 750 టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలిగింది.

ఆసియాలోనే ప్రయోగాత్మకంగా బొగ్గు ఆధారంగా ఎరువులు తయారు చేసే ఈ కర్మాగారాన్ని బొగ్గు కొరత, కరెంటు కోతలతో 1992లో బీఐఎఫ్ఆర్‌ ఖాయిలా పరిశ్రమగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దానికి సాంకేతికతను అందించి గ్యాస్‌ ఆధారిత ఫ్యాక్టరీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL)’ పేరుతో కంపెనీని ప్రారంభించేందుకు జరిగిన ఒప్పందం పై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లు సంతకాలు చేశారు.