బండి సంజయ్ పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
TRS MLA Guvvala Balaraju criticized the BJP : కుల, మతాల ప్రస్తావనతోనే బీజేపీ కాలం గుడుపుతుందని టీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నేతల అని మండిపడ్డారు. శుక్రవారం (జనవరి 8, 2021)న తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేశారని అడుగుతుంటే..బండి సంజయ్ పిచ్చి పట్టిన కుక్కలా అరుస్తూ తిరుగుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమి లేదన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను ప్రధాని మోడీ మోసం చేశారని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 2048 వచ్చినా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు వచ్చినా..తెలంగాణ ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. దాడులకు పాల్పడే దమ్ము ఉంటే తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు.
మహిళలకు గౌరవం ఇవ్వని బీజేపీ నేతలు.. వారి గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. లెక్కాపత్రం లేకుండా బీజేపీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం సరికాదన్నారు. ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.