కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం చెప్పిన తనయుడు 

  • Published By: murthy ,Published On : May 29, 2020 / 07:56 AM IST
కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం చెప్పిన తనయుడు 

తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పధకాలురచిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు కేసీఆర్. 

ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన తుది పంపు హౌజ్ మర్కూక్ పంపు హౌజ్ ను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. మెతుకు సీమను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ సాగర్ ను సీఎం ప్రారంభించి.. గోదావరి జలాలకు హారతి పట్టారు. రైతులకు సాగునీరు అందిస్తున్న కేసీఆర్ పై రాష్ర్ట వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. తన తండ్రి కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చారు. 
కే అంటే కాల్వలు, 
సీ అంటే చెరువులు, 
ఆర్‌ అంటే రిజర్వాయర్లు
అని కేటీఆర్‌ తెలిపారు. 

కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్‌ పేరు సార్థకమైందన్నారు‌. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించారని తెలిపారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ర్టం.. కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసింది అని కేటీఆర్ తెలిపారు. 

కొండపోచమ్మ సాగర్‌ కింద 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేశావపురం రిజర్వాయర్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కేటీఆర్‌. దీంతో హైదరాబాద్‌ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దూరదృష్టితో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేవిధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

 

Read: గోదారి నీళ్లు కొండెక్కిస్తాన్నాడు…కాళేశ్వరం కట్టాడు..నీరు పారించాడు