TSPSC Paper Leak : 100కు పైగా మార్కులు వచ్చిన వారిపై సిట్ నిఘా
ఎంతవరకు చదివారు? ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు?(TSPSC Paper Leak)
TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాఫ్తు కొనసాగుతోంది. గ్రూప్ -1 పరీక్షలో వంద మార్కులకుపైగా వచ్చిన వారి లిస్ట్ ను సిట్ అధికారులు తయారు చేశారు. టీఎస్ పీఎస్ సీ బోర్డు నుంచి అభ్యర్థుల సమాచారం సేకరించిన అధికారులు గ్రూప్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫోన్ చేసి విచారణకు పిలిపిస్తున్నారు.
సిట్ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థుల నుంచి 15 అంశాలపై అధికారులు వివరాలు తీసుకుంటున్నారు. అభ్యర్థి బయోడేటాతో పాటు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు వంటి అంశాలను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు? ఎన్ని మార్కులు వచ్చాయి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.(TSPSC Paper Leak)
గతంలో టీఎస్ పీఎస్ సీ పరీక్ష రాస్తే వాటి సమాచారం కూడా సిట్ అధికారులు తీసుకుంటున్నారు. సమాచారం సేకరించిన అనంతరం అవసరమైతే తిరిగి సంప్రదిస్తామని అభ్యర్థులకు సిట్ అధికారులు సూచిస్తున్నారు. రేపు ఇంకొంతమంది అభ్యర్థులు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓవైపు నిందితులను సుదీర్ఘంగా విచారిస్తూ కీలక అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తూనే మరోవైపు గ్రూప్-1 ఎగ్జామ్ లో వందకుపైగా మార్కులు వచ్చిన వారందరినీ కూడా విచారించాలని సిట్ నిర్ణయించింది. అందులో భాగంగా ఎగ్జామ్ రాసిన వివరాలను బోర్డు నుంచి సేకరించింది.(TSPSC Paper Leak)
సుమారుగా 500 మందికిపైగా అభ్యర్థుల జాబితాను బోర్డు నుంచి సిట్ తీసుకున్నట్లు సమాచారం. గ్రూప్ -1 పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చిన 10మంది అభ్యర్థులను సిట్ అధికారులు ఆదివారం(మార్చి 26) విచారించారు. సిట్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చిన అభ్యర్థులు విచారణకు హాజరయ్యారు. సిట్ బృందం అడిగిన సమాచారం ఇచ్చారు.