ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు.. దసరా తర్వాతే క్లారిటీ

  • Published By: naveen ,Published On : October 24, 2020 / 02:38 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు.. దసరా తర్వాతే క్లారిటీ

rtc bus services: దసరా తర్వాతే తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తేల్చి చెప్పారు. శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ బస్సులు ఏపీ సరిహద్దుల వరకే వెళ్తాయని శర్మ చెప్పారు. ఇక ఏపీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై సందిగ్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై జూన్‌ 18 నుంచి ఏపీ, టీఎస్‌ ఆర్టీసీ అధికారులు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా చర్చలు కొలిక్కి రావడం లేదు.

కిలోమీటర్లపై పేచీ:
లాక్‌డౌన్‌కు ముందు వరకు ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 కిలోమీటర్ల మేర తిరిగేవి. తెలంగాణ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర సేవలందించేవి. అన్‌లాక్‌ నిబంధనల తర్వాత.. ఇరు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సేవలపై కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉండగా.. అవి ఎంతకూ ఒక కొలిక్కి రాలేదు. కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ.. మీరే కిలోమీటర్లు పెంచుకోండంటూ ఏపీ వాదించుకుంటూ వచ్చాయి. దీంతో.. ఎప్పటికప్పుడు ఫలితం లేకుండానే చర్చలు ముగుస్తున్నాయి.

డిమాండ్ కు అంగీకరించిన ఏపీ ఆర్టీసీ అధికారులు:
కాగా, తాజాగా జరిగిన చర్చల్లో.. ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలంగాణలో తమ బస్సులను 1.61 లక్షల కిలోమీటర్లు తిప్పేందుకు అంగీకరించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలకు మార్గం సుగమమైంది. ఈ చర్చల వివరాలను తెలంగాణ అధికారులు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్‌ శర్మకు వివరించారు. వారు సీఎం కేసీఆర్‌కు ఓ నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ఆ నివేదికలో సీఎం కేసీఆర్ కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. అదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. ఏపీ అధికారులకు తెలియజేశారని తెలుస్తోంది. దీనికి ఏపీ సర్కారు అంగీకరిస్తే.. మంగళ లేదా బుధవారం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేవారికి గుడ్‌న్యూస్:
తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేవారికి ఏపీ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల దగ్గర, సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర ఏపీ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టల దగ్గర ఏపీ బస్సులు ఉంటాయన్నారు. సరిహద్దుల నుంచి ఊళ్లకు చేరేందుకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

బోర్డర్ దాకా వస్తే చాలు, గమ్యం చేరుస్తాం:
దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్‌ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. అయితే పండుగ సందర్భంగా ప్రయాణికులు సౌలభ్యం కోసం రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సులు నడిపేందుకు ఏసీఎస్‌ ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు.

దసరా సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ (విజయవాడ జోన్) ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌కు బస్సులు నడపలేకపోతున్నామని, అయితే సరిహద్దుల దాక నడుపుతామని వెల్లడించారు. విజయవాడ నుంచి గరికపాడు వరకూ, గుంటూరు జిల్లాలో చెక్‌పోస్ట్‌ వరకూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఏపీఎస్‌ ఆర్టీసీకి నష్టం వస్తున్నా:
తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా కూడా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఏపీఎస్‌ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయ్యామని చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్‌ ఆర్టీసీకి నష్టం వస్తున్నా కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు నడపాలనే ఉద్దేశంతో టీఎస్‌ ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించామని వివరించారు. అక్టోబర్ 19నే తుది ప్రతిపాదనలు పంపించామని, వాళ్లు కోరినట్లు ప్రతిపాదనలు పంపినా ఇంకా గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

రోజుకు 3.5 కోట్ల రూపాయల నష్టం:
విజయవాడ – హైదరాబాద్‌ రూట్లో ఏపీ ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం. ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించ లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వస్తోంది అని కృష్ణబాబు తెలిపారు.