గోవాలో భర్త, తెలంగాణలో భార్య.. దంపతుల ఖతర్నాక్‌ దందా, ఇలా ఓ మహిళ పట్టుబడటం ఇదే ఫస్ట్ టైమ్

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 11:49 AM IST
గోవాలో భర్త, తెలంగాణలో భార్య.. దంపతుల ఖతర్నాక్‌ దందా, ఇలా ఓ మహిళ పట్టుబడటం ఇదే ఫస్ట్ టైమ్

woman held for IPL betting: భర్త జీవితంలో భార్య కూడా సగభాగం అంటుంటారు. అది నిజమే.. అయితే భర్త చేసే మంచి పనుల్లో పాలు పంచుకుంటే దానికో లెక్కుంటుంది. కానీ..ఓ మహిళ భర్త చేసే నేరంలోనూ ఓ చేయ్యేసింది. భర్త చేసే దందాలో కాసుల వర్షం కురుస్తుండటంతో కంటిన్యూ చేసింది. గుట్టుచప్పుడు కాకుండా దందా చేస్తూ..లక్షల రూపాయలు వెనకేసుకున్నారు ఆ దంపతులు. చివరకు బండారం బయటపడి జైలు పాలయ్యారు.

గోవాలో భర్త.. తెలంగాణలో భార్య.. అక్కడ జోరుగా బెట్టింగ్‌.. ఇక్కడ పైసా వసూల్‌.. ఓ దంపతుల ఖతర్నాక్‌ దందా.. గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌.. గుట్టు తేల్చి జైలుకు పంపిన పోలీసులు..

క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో ఓ మహిళ పట్టుబడటం ఇదే ఫస్ట్ టైమ్:
ఐపీఎల్‌ వేళ దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతోంది. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఆడుతున్న సందర్భంలో ప్రతి బంతికీ బెట్టింగ్‌ కాస్తున్నారు. కొంతమంది బుకీలు ఏకంగా దుబాయ్‌లో ఉన్న ముఠాలతో సంబంధాలు పెట్టుకుని దందా నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా చూసుకుంటే…రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో…క్రికెట్‌ బెట్టింగ్‌ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రతీసారి బెట్టింగ్ రాయుళ్లతో పాటు నగదు, మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు పట్టుబడిన వారిలో దాదాపుగా అందరూ మగవారే. కానీ..తాజాగా హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో ఓ లేడి పట్టుబడింది. ఇలా ఓ మహిళ పట్టుబడటం ఇదే మొదటి సారి.


నెలన్నర క్రితం గోవాకు వెళ్లిన ధరమ్‌సింగ్‌, ఐపీఎల్‌ ప్రారంభం నాటి నుంచి బెట్టింగ్‌:
మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన ధరమ్‌సింగ్‌..నగరంలో బెట్టింగ్‌ నిర్వహిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని నెలన్నర కిందట గోవాకు వెళ్లాడు. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాక అక్కడి నుంచి బెట్టింగ్‌ మొదలుపెట్టాడు. తన అల్లుడు రాహుల్‌కు(27) నెలకు 20 వేలు జీతం ఇస్తానని, ఫోన్‌ ద్వారా బెట్టింగ్‌ కాసేవారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించాడు. ఈ ఆఫర్‌ విన్న రాహుల్‌.. ఓ పదిహేను సెల్‌ఫోన్‌ నంబర్లను ధరమ్‌సింగ్‌కు పంపించాడు. అనంతరం వారితో సంప్రదింపులు జరిపి బెట్టింగ్‌లు కాసేవాడు ధరమ్‌సింగ్‌.

స్కూటీపై వెళ్లి డబ్బు వసూలు చేస్తున్న భార్య:
ఇక ఇటు, హైదరాబాద్‌లో బెట్టింగ్‌ కాసిన వారి నుంచి ధరమ్‌సింగ్‌ భార్య సుమలత(37) డబ్బు వసూలు చేస్తుంటుంది. బెట్టింగ్ కాసిన వారి వివరాలు తెలుసుకుని స్కూటీపై అక్కడికి వెళ్లి డబ్బు తీసుకువస్తుంటుంది. ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచే గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాను సాగిస్తున్నారు. అయితే దీనిపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. మంగళవారం రాత్రి ధరమ్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా..బెట్టింగ్ ల వ్యవహారం వెలుగుచూసింది. దంపతులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఒక టీవీ, 15 సెల్ ఫోన్లు, 27వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

చెడ్డ దారులు తొక్కొందంటూ భర్తకు చెప్పుకోవాల్సిన ఆ లేడి…భర్త చేసే నేరంలోనూ తానూ ఓ చేయ్యేసి..ఇదిగో ఇలా చివరకు భర్తతో కలిసి కటకటాలపాలైంది.