ఓజోనిట్ : సరుకుల్లో వైరస్ కట్టడికి ఓరుగల్లు నిట్ ప్రోఫెసర్ల ఆవిష్కరణ
కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఇలాంటి కేసులు చూసినప్పడు వైరస్ ఎలా వ్యాపిస్తోందో అర్ధంకాని పరిస్దితి..కొన్ని సార్లు మనం తెచ్చుకునే పచారీ సరుకులు, కూరలు, కరెన్సీ,ద్వారా కూడా వస్తోందని తెలుస్తోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి వరంగల్ నిట్ కు చెందిన ఇద్దరు ప్రోఫెసర్లు సరికొత్త పరికరాన్ని తయారు చేశారు. నిట్లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ దినకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీ హరినాథ్ సంయుక్తంగా ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్ వంటి బహుళార్ధక స్టెరిలైజేషన్ పరికరాన్ని రూపోందించారు.
ఎలా పని చేస్తుంది
నిత్యావసరాలను, సరుకులను ఫ్రిడ్జ్ వంటి ఈ పరికరంలో ఉంచి అందులోకి ఓజోన్ వాయువును పంపిస్తారు. 20 నుంచి 25 నిమిషాల వరకు ఓజోన్ వాయువులో ఉంచడం వల్ల వస్తువులపై ఉన్న అన్ని రకాలైన వైరస్లు 99.99 శాతం తొలిగిపోతాయి. కరోనా వ్యాప్తివాహక వస్తువులైన కూరగాయలు, పండ్లు, పాలు, ఆభరణాలు, సెల్ఫోన్లు, వాచ్లు, దుస్తులు, డెలివరీ ప్యాకింగ్లు.. ఇలా అన్నింటినీ వైరస్ రహితంగా మార్చుకోవచ్చు.
పండ్లు, ఇతర తినుబండారాలపై ఉండే ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర రసాయనాలను కూడా లేకుండా శుభ్రంచేయడం దీని ప్రత్యేకత. ఓజోన్ పంపింగ్ విధానం వల్ల వస్తువులు శుభ్రమవుతాయి. ఈ ఫ్రిడ్జ్ను పూర్తిస్థాయిలో తయారుచేసి మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రొఫెసర్ దినకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరినాథ్ తెలిపారు.