ఏప్రిల్ 1న నగరంలో నీరు బంద్.. కారణం ఇదే!
హైదరాబాద్ నగరంలో పైపులైన్ విస్తరణ పనులు కారణంగా పలు ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటవ తేదీన నీటి సరఫరా బంద్ చేయనున్నట్లు వాటర్బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేసిన అధికారులు.. నీరు పొదుపుగా వాడుకోవాలని, ఎండాకాలంలో నీరు పొదుపుగా వాడుకుంటేనే నిత్యావసరాలకు సరిపోతుందని, లేకుంటే ప్రజలే ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని, నీరు పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1కు చెందిన 1200ఎంఎం డయామెయిన్ పైపులైన్ జంక్షన్ పనులు, చంద్రాయణగుట్ట నుంచి కందికల్ గేట్ క్రాస్ రోడ్డు వరకు పైపులైన్ విస్తరణ పనులు చేపట్టగా.. ఏప్రిల్ ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి 24గంటల పాటు పనులు కొనసాగనున్నట్లు అధికారులు చెప్పారు.
వీటి కారణంగా ఆపరేషన్ మెయింటెనెన్స్ డివిజన్-1 పరిధిలోని మీరాలం రిజర్వాయర్, కిషన్బాగ్ ప్రాంతం, ఆపరేషన్ మెయింటెనెన్స్ డివిజన్-2 పరిధిలోని అల్జుబైల్ కాలనీ, అలియా బాద్ రిజర్వాయర్ ప్రాంతం, బాలాపూర్ రిజర్వాయర్ ప్రాంతాలకు 24గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు సూచనలు చేశారు.