Yadadri Temple : యాదాద్రిలో కరోనా వ్యాప్తికి ఎవరు కారణం ?

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది.

Yadadri Temple : యాదాద్రిలో కరోనా వ్యాప్తికి ఎవరు కారణం ?

Yadadri

spread of corona : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్నఅర్చకులు, అధికారులు, సిబ్బందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాజిటివ్‌ వచ్చిన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రికి క్యూ కట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈనెల 25వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో యాదాద్రి ఆలయానికి చెందిన ఓ అర్చకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. 26న మరికొందరు పరీక్షలు చేయించుకోగా యాదాద్రికి చెందిన నలుగురు అర్చకులు, సిబ్బంది, మరో ఇద్దరు హయగ్రీవ స్వామి ఆలయ అర్చకులకు పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. వీరు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా సోకినట్లు తేలింది.

ఈ నెల రెండో వారం నుంచే కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికీ… యాదాద్రి క్షేత్రంలో మాత్రం నిర్లక్ష్యం కనిపించింది. ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతున్నా యాదాద్రి క్షేత్రంలో కోవిడ్‌ 19 నిబంధనలు గాలికొదిలేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల తర్వాత తెరుచుకున్న ఆలయంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారు. కానీ ఆ తర్వాత మాత్రం వాటిని మర్చిపోయారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోలేదు. మాస్కులు ధరించకుండానే ఆలయ పరిసరాల్లో తిరిగేశారు.

కనీసం భౌతికదూరం కూడా పాటించలేదు. అన్‌లాక్‌ కావడంతో యాదాద్రి క్షేత్రానికి హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 15నుంచి 25వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు అలంకార సేవలు, తిరుకల్యాణం, రథోత్సవం, శ్రీ చక్ర స్నానం వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో గుంపులుగా కూర్చోవడం, మాస్కులు ధరించకపోవడంతో ఆలయంలో అర్చకులు, అధికారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఈఓ, వివిధ సెక్షన్ల కార్యాలయాల్లో శానిటైజేషన్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆలయంలో శ్రీస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు. నిత్య పూజలన్నీ అంతరంగికంగా నిర్వహించనున్నారు. అటు ఘాట్‌ రోడ్డులోని జీయర్‌ కుటీర్‌లో నిర్వహించే అన్నదానం కూడా బంద్‌ చేశారు. భక్తులకు కేవలం లఘుదర్శన అవకాశం మాత్రమే కల్పించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఈవో కోరారు