అసలు దీక్షిత్‌ను సాగర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎందుకు చంపేశాడు? ఎలా దొరికిపోయాడు?

  • Published By: naveen ,Published On : October 22, 2020 / 04:26 PM IST
అసలు దీక్షిత్‌ను సాగర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎందుకు చంపేశాడు? ఎలా దొరికిపోయాడు?

deekshith: మహబూబాబాద్‌లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతంగా ముగిసింది. ముద్దులొలికే పసివాడిని కిడ్నాప్ చేసిన మంద సాగర్(23) అనే యువకుడు గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. ఏదో ఆశించి.. ఇంకేదో జరుగుతుందని భావించి.. అమాయక చిన్నారిని నిర్దాక్షిణ్యంగా నులిమేశాడు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. ఆదివారం(అక్టోబర్ 18,2020) దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన సాగర్.. గంట గంటన్నర వ్యవధిలోనే హత్య చేశాడు. అసలు దీక్షిత్‌ను సాగర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు..? ఏం చేయాలనుకున్నాడు..? చివరకు ఏం జరిగింది..?

చుట్టుపక్కల ఉన్న వాళ్లే తన బిడ్డను టార్గెట్ చేస్తారని ఊహించలేదు:
సీన్‌-1.. దీక్షిత్ తొమ్మిదేళ్ల బాలుడు. కృష్ణకాలనీకి చెందిన రంజిత్ దంపతుల గారాల కొడుకు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంట్లో ఆటలాడి, అమ్మా నాన్నలతో ముద్దులాడాడు. తండ్రి రంజిత్ రెడ్డి ఓ ప్రైవేట్ ఉద్యోగి. భార్యతో కలిసి చీటీలు నిర్వహిస్తున్నాడు. దీక్షిత్‌కు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. ఉన్నంతలో.. వచ్చే సంపాదనతో హ్యాపిగా ఉంది రంజిత్ కుటుంబం. చుట్టుపక్కల ఉన్న వాళ్లే తన బిడ్డను టార్గెట్ చేస్తాడని రంజిత్ కుటుంబం ఎనాడు ఊహించి ఉండదు. కానీ అదే జరిగింది.

రాముడు మంచి బాలుడిలా కటింగ్ ఇచ్చిన సాగర్:
సీన్‌-2.. చిన్నారి దీక్షిత్‌ సాయంత్రం కాగానే తన సోదరుడితో పాటు కాలనీలో ఉండే పిల్లలతో కలిసి ఆడేవాడు. ఎప్పుడూ చలాకిగా నవ్వుతూ ఉండేవాడు. దీక్షిత్‌పై కన్నేసిన సాగర్‌.. అతను ఆడుకునే సమయంలోనే కిడ్నాప్ చేయాలని భావించాడు. ముందే ప్లాన్‌ వేసుకున్న సాగర్.. అందులో భాగంగానే దీక్షిత్ కుటుంబసభ్యులను పలకరిస్తూ దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. రాముడు మంచి బాలుడిలా కటింగ్ ఇచ్చాడు. ఎవరికి తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా జాగ్రత్తపడ్డాడు.

మాటు వేసి అదను చూసి కిడ్నాప్:
సీన్‌-3… పిల్లలు ఆడుకుంటున్న సమయంలోనే కిడ్నాప్ చేయాలని స్కెచ్చేశాడు సాగర్. ఆదివారం మధ్యాహ్నం తండ్రితో కలిసి బయటకు వెళ్లొచ్చాక. దీక్షిత్ సోదరులు ఇంటి ముందర ఆడుకుంటున్నారు. ఆ సమయంలో రంజిత్ ఇంటి పరిసరాల్లో సాగర్ రెక్కీ నిర్వహించాడు. మాటు వేసి అదను చూసి పిల్లాడి దగ్గరికి వెళ్లాడు. మాయ మాటలు చెప్పి బైక్‌ ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో తోటి పిల్లలంతా అక్కడే ఉన్నారు. వాళ్లందరికి సాగరన్నతో వెళ్తున్నాననే చెప్పి వెళ్లాడు దీక్షిత్‌.

sagar

దీక్షిత్ ఫ్రెండ్స్ చూసేశారని తెలిశాక టెన్షన్ పడ్డాడు:
సీన్‌ 4… ఇంటిముందు ఆడుకుంటున్న దీక్షిత్‌ను చాకచాక్యంగా తన బైక్‌పై ఎక్కించుకున్నాడు సాగర్. సీసీ ఫుటేజ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. బైక్‌పై దీక్షిత్‌ను ఎక్కించుకుని తాళ్లపూసలపల్లి వైపు వెళ్లాడు. బాబును ఓ ప్లేస్‌లో దాచేసి తల్లిదండ్రులకు కాల్ చేయాలనుకున్నాడు. దీక్షిత్‌ను అడ్డం పెట్టుకుని భారీగా డబ్బు వసూలు చేయాలని భావించాడు. కానీ దీక్షిత్‌ను తీసుకొచ్చే సమయంలో అతని ఫ్రెండ్స్‌ తనను చూశారన్న విషయం గుర్తుకు రావడంతో ఆలోచనలో పడ్డాడు.

దొరికిపోతానని భయపడ్డాడు, అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు:
సీన్ 5…. తాళ్లపూసలపల్లి వైపు బైక్‌ టర్న్ చేసిన సాగర్‌.. ఆ తర్వాత నేరుగా దానవయ్య గుట్టల వైపు వెళ్లాడు. దీక్షిత్‌ను ఎక్కువ సేపు తిప్పితే ప్రమాదమని పసిగట్టాడు. బాలుడు అరిచినా కేకలు వేసినా చివరకు ఏడ్చినా స్థానికులు గమనిస్తే దొరికిపోతానని భావించాడు. ముందుగా దీక్షిత్ అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. కిడ్నాప్ అయితే చేశాడు గానీ ఆ తర్వాత ఎలాంటి స్టెప్ వేయాలన్న దానిపై సాగర్ చాలా సేపు డైలమాలో పడ్డాడు.

తాను సేఫ్ గా ఉండాలంటే దీక్షిత్ బతికి ఉండకూడదనుకున్నాడు:
సీన్‌ 6… దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన సాగర్.. దాదాపు గంటసేపు ఆలోచనలో పడ్డాడు. దీక్షిత్ ఎక్కువ సేపు తన దగ్గరుంటే సేఫ్ కాదనుకున్నాడు. ఒకవేళ బాబు ఏడిస్తే తాను ఈజీగా దొరికిపోతానని భావించాడు. తాను సేఫ్‌గా ఉండాలంటే బాబు బతికి ఉండకూడదనుకున్నాడు. ముందుగా దీక్షిత్‌ను చంపేసి ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేయాలని ప్లానేశాడు. ఇందులోభాగంగానే కిడ్నాప్‌ చేసిన గంటన్నరలోనే చిన్నారిని గుట్టల సాక్షిగా చిదిమేశాడు సాగర్‌.

బాబుని చంపాక డ్రామా స్టార్ట్ చేశాడు, ఫేక్ యాప్ ద్వారా కాల్స్:
సీన్ 7.. దీక్షిత్‌ను చంపేసిన తర్వాత అసలు డ్రామా మొదలెట్టాడు సాగర్. బాలుడి తల్లికి కాల్ చేసి ఏకంగా 45లక్షలు డిమాండ్ చేశాడు. చంపేసిన మరుసటి రోజు నుంచి కాల్స్ మొదలెట్టాడు. బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించాడు. తాను ఉండే లోకేషన్‌ ఎవరికీ దొరకకుండా ఫేక్ యాప్‌ నుంచి కాల్స్ చేశాడు. అందులో అనేబుల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి తాను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నది పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. అలా 11సార్లు కాల్ చేశాడు. చివరగా అనెబుల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయకుండా కాల్‌ చేసి పోలీసులకు దొరికిపోయాడు.

కిడ్నాప్ ఎపిసోడ్‌లో సాగర్‌ ఒక్కడేనా..? ఇంకా ఎవరైనా ఉన్నారా?
సీన్‌ 8… నాలుగు రోజుల తర్వాత సాగర్‌ పోలీసులకు దొరికిపోయాడు. దీక్షిత్‌ను చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈరోజు(అక్టోబర్ 22,2020) తెల్లవారుజామున 3 గంటల వరకు.. ఏమేం చేశాడో మొత్తం వివరించాడు సాగర్. నిందితుడు ట్రేస్‌ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. కిడ్నాప్ ఎపిసోడ్‌లో సాగర్‌ ఒక్కడేనా..? అతనికి ఎవరైనా సహకరించారా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

దీక్షిత్ మళ్లీ వస్తాడని, ఇంట్లో నవ్వులు విరబూస్తాయని అనుకున్న తల్లిదండ్రులు:
సీన్‌ 9 .. చిన్నారి దీక్షిత్ మళ్లీ వస్తాడనుకున్నారు.. ఇంట్లో నవ్వులు విరబూస్తాయనుకున్నారు.. మునుపటిలా ఆడుకోవచ్చని అమ్మానాన్న ఆశపడ్డారు. కానీ వాళ్ల ఆశలు, విఙ్ఞప్తులేవీ ఫలించ లేదు. సాగర్ దురాశకు దీక్షిత్ బలైపోయాడన్న వార్త తెలుసుకుని గుండెలు బాదుకున్నారు. దీక్షిత్ ఇక రాడనే నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతం కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆ పొరపాటుతో సాగర్ దొరికిపోయాడు, లేదంటే ఇంకా చాలారోజులకి నిజం బయటకు వచ్చేది కాదు:
సీన్‌ 10.. సాగర్ దుర్మార్గాన్ని తెలుసుకుని కృష్ణ కాలనీ అంతా నివ్వెరపోయింది. జరిగిన ఘోరాన్ని తలచుకుని షాకైంది. సాగర్ తమ మధ్య తిరుగుతూ క్రైమ్ కథా చిత్రాన్ని అల్లుకున్నాడా అని అవాక్కయింది. దీక్షిత్ కిడ్నాప్ ఘటన పోలీసులకు సరికొత్త సవాళ్లను ముందు ఉంచింది. సాగర్ ఫేక్ యాప్ కాల్‌లో అనెబుల్ ఆప్షన్‌ మరచిపోయి కాల్ చేయడంతోనే దొరికిపోయాడు. లేదంటే..? ఈ నిజం ఇంకా చాలా రోజులకి బయటకు వచ్చేదేమో. టెక్నాలజీ మంచికే కాదూ.. చెడుకి కూడా ఉపయోగపడడం బాధాకరం.