Night Curfew : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందా? మినీ లాక్ డౌన్ విధిస్తారా?
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ రేపు ఉదయం ముగుస్తుంది. తదుపరి కర్ఫ్యూ కొనసాగుతుందా...? లేదంటే మినీ లాక్డౌన్ విధిస్తారా? ఈ అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.
night curfew in Telangana : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ రేపు ఉదయం ముగుస్తుంది. తదుపరి కర్ఫ్యూ కొనసాగుతుందా…? లేదంటే మినీ లాక్డౌన్ విధిస్తారా? ఈ అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. నేడు సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు భారీగా నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమై రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఈ నెల 20 నుంచి అమలులోకి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే రేపు ఉదయంతో కర్ఫ్యూ గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది.
కరోనా కేసుల తీవ్రత తగ్గకపోవడంతో వైరస్ ఉధృతిని అదుపులోకి తెచ్చేందుకు నైట్ కర్ఫ్యూ కొనసాగించడం, లేదంటే మినీ లాక్డౌన్ విధించడమో తప్ప ప్రత్యామ్నాయం లేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం లాక్డౌన్ విధించే అవకాశం లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాటిస్తామన్నారు. అయితే ఇవాళ కేసీఆర్ సమీక్ష తర్వాత కీలక నిర్ణయం వెలువడనుంది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరుపుతోంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై ఇప్పటికే నివేదిక కోర్టుకు సమర్పించారు. అయితే ఈ నివేదికపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపు ఉదయం రాత్రి కర్ఫ్యూ ముగియనుండటంతో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏమిటో చెప్పాలని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ ఈ అంశంపై కర్ఫ్యూ ముగిసే రోజు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. దీంతో ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.