ఆస్తి కోసం వాహనంతో తొక్కించి మహిళను చంపేశారు

ఆస్తి కోసం వాహనంతో తొక్కించి మహిళను చంపేశారు

Woman killed after being hit by vehicle for property : మహబూబ్ నగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువులను తన వాహనంతో ఢీకొట్టాడు. అంతటితో ఆగక మీదకెక్కించి మహిళను అంతమొందించాడు. గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాలానగర్‌ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య..షాద్‌నగర్‌లో నివాసముంటున్నాడు. యాదయ్య తల్లి, ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కలిపి జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల పొలం ఉంది. దీన్ని ఆర్నెల్ల కిందట యాదయ్య రూ.80 లక్షలకు విక్రయించారు. అందులో తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఎవరికీ ఇవ్వలేదు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం యాదయ్య తన భార్య శైలజ, కుమార్తె నిహారికతో కలిసి ద్విచక్రవాహనంపై నవాబ్‌పేట మండలం కారుకొండలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇది గమనించిన యాదయ్య చిన్నమ్మ కుమారుడు.. మహబూబ్‌నగర్‌లోని ఏనుగొండలో నివాసముంటున్న నర్సింహులు సరకు రవాణా వాహనంతో వెంబడించాడు.

మాచారం శివారులో వెనుక నుంచి వచ్చి యాదయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ కింద పడిపోయారు. వెంటనే తేరుకొన్న యాదయ్య లేచి కొంతదూరం పరుగులు తీశారు. కింద పడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా.. నర్సింహులు తన వాహనాన్ని మళ్లీ వెనక్కు పోనిచ్చి రెండోసారి ఢీకొట్టాడు. తిరిగి ఆమె కింద పడిపోవడంతో వాహనాన్ని శైలజ పైకి ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

అనంతరం నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. పొలం అమ్మిన డబ్బుల విషయంలో తాగాదా జరిగిందని. ఈ నేపధ్యంలో వీరిని హతమార్చేందుకు సమీప బంధువులే ప్లాన్ చేశారని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.