హైదరాబాద్‌లో మరో ఘోరం, మార్నింగ్ వాక్‌కి వెళ్లిన వృద్ధురాలు నాలాలో పడి మృతి

  • Published By: naveen ,Published On : November 3, 2020 / 03:04 PM IST
హైదరాబాద్‌లో మరో ఘోరం, మార్నింగ్ వాక్‌కి వెళ్లిన వృద్ధురాలు నాలాలో పడి మృతి

Woman slips into nala : హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో మరో దారుణం జరిగింది. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సరోజ అనే వృద్ధురాలు(80) నాలాలో పడి మృతి చెందింది. సరూర్‌ నగర్‌ చెరువు కింద ఉన్న శారదానగర్‌కు చెందిన సరోజ ఈ రోజు(నవంబర్ 3,2020) తెల్లవారుజామున వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ ప్రమాదవశాత్తు కోదండరామ్ నగర్ దగ్గర నాలాలో పడి కొట్టుకుపోయింది.

దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన GHMC సిబ్బంది, DRF టీమ్‌, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చైతన్యపురి హనుమాన్‌నగర్‌ నాలాలో మహిళ మృతదేహాన్ని గుర్తించాయి రెస్క్యూ టీమ్స్‌. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నాలాలో మహిళ పడిపోయిందన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను ఆయన పరిశీలించారు. మహిళ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి.