జనరంజక పాలన ముందుందిక.. ష‌ర్మిల ఫ్లెక్సీల్లో ఆస‌క్తిక‌ర నినాదాలు

జనరంజక పాలన ముందుందిక.. ష‌ర్మిల ఫ్లెక్సీల్లో ఆస‌క్తిక‌ర నినాదాలు

ys sharmila interesting flexies at lotus pond: వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల హైద‌రాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ వైఎస్ఆర్ అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది. వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. షర్మిల ఏం చెప్పనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, లోటస్ పాండ్ దగ్గర ఏర్పాటు చేసిన పోస్ట‌ర్లు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో వైఎస్ఆర్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ , విజయమ్మ ఫొటోలు లేవు. అంతేకాదు అందులో ఉన్న నినాదాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

మన కష్టం తెలుసని, మన కన్నీళ్లు తెలుసని, మన బ‌తుకులు మార్చే బాట అనే నినాదం ఉంది. ఆ బాట ఏంటో వైఎస్సార్ కుటుంబానికి తెలుసని, షర్మిలమ్మ నాయకత్వం వ‌ర్థిల్లాల‌ని ఫ్లెక్సీల్లో ఉంది.

ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కానీ విజయమ్మ ఫొటో కానీ లేకపోవడం విశేషం. జనంలోకి షర్మిలక్క వ‌స్తున్నార‌ని, జనరంజకపాలన ముందుందిక అంటూ ప‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు కావ‌డం ఆసక్తిక‌రంగా మారింది.

గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలను స‌మావేశానికి రావాల‌ని షర్మిల ఇప్ప‌టికే ఆహ్వానించారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ సమావేశంలో కొత్త పార్టీపై కార్యకర్తలతో షర్మిల చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. లేదంటే ష‌ర్మిల నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లోనూ వైసీపీ ముందుకు వెళ్తుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ఈ రోజు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.