పాలేరు నుంచి ఎన్నికల బరిలోకి వైఎస్ షర్మిల

పాలేరు నుంచి ఎన్నికల బరిలోకి వైఎస్ షర్మిల

Ys Sharmila Will Contesting The Election From Paleru

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం చేసిన వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. వైఎస్‌కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగంటూ ఆమె చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంజనాన్ని ఆపలేరని పునరుద్ఘాటించారు వైఎస్ షర్మిల. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులు, సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల.. ఎక్కువగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. తరువాత ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికలు జరగగా.. అక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డి బరిలోకి దిగి గెలిచి తర్వాతి కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు షర్మిల పోటీచేస్తున్నట్లు చెప్పగానే నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోంది.