షర్మిల నోట జై తెలంగాణ నినాదం
YS Sharmila Jai Telangana slogan : జై తెలంగాణ నినాదం ఇవాళ్టి వైఎస్ షర్మిల సమావేశంలో ప్రధాన అంశంగా మారింది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్ అంటూ ఆమె చేసిన నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక చనిపోయినవాళ్లలో తెలంగాణ వాళ్లే అధికంగా ఉన్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకముందు తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ కులమతాలకు అతీతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లో రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాల పరిధిలోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల పాల్గొన్నారు. జై తెలంగాణ, జోహార్ వైఎస్సార్ అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
పేదలు, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీర్చిదిద్దారన్న షర్మిల.. ప్రజల ఆశీర్వాదంతో నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. పలు అంశాలపై అభిమానుల అభిప్రాయాలు సేకరించేందుకు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు కోరారు.