Telangana Govt : రైతులకు పండుగలాంటి వార్త.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం! 7 రకాలకు రూ.500 బోనస్
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Telangana government
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు రూ.18,250 కోట్ల అంచనా విలువతో కొనుగోళ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్టోబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ వానాకాలం సీజన్లో తెలంగాణలో 119.57 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో సుమారు 45 లక్షల టన్నుల సన్న ధాన్యం, 20 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు సమీపంలోనే ధాన్యాన్ని విక్రయించే అవకాశం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, మరో 731 ఇతర కేంద్రాలు ఉండనున్నాయి. ఈ కేంద్రాలన్నింటినీ అక్టోబర్ 1 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలు, తేమ శాతం పరిశీలన వంటి ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ధాన్యం విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాల్కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 చెల్లించనున్నారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వనుంది. వీటిలో బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, జైశ్రీరామ్, హెచ్ఎంటీ-సోనా, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుంది. సన్న రకాల సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన ధర లభించేలా చూడటం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
