Home » అప్పుడు UP ఇప్పుడు MP : కల్తీ మద్యానికి మరో 11 మంది బలి
Published
2 weeks agoon
Toxic liquor kills 11 in MP Morena : కల్తీ మద్యం మందుబాబుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తోంది. మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు చెహ్రా మాన్పూర్, పెహ్వాలీ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మధ్యప్రదేశ్ లో గత ఏడాది అక్టోబరులో కూడా కల్తీ మద్యం కారణంగా 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ ఘటన మరవ ముందే మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం గమనించాల్సిన విషయం. రాష్ట్రంలో కల్తీ మద్యం అనేక ప్రాంతాల్లో లభ్యమవుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.
కాగా నాలుగు రోజుల క్రితం యూపీలో బులంద్షహర్ జిల్లా జీత్గఢీ గ్రామంలో స్థానికంగా కొంతకాలంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఈక్రమంలో గత బుధవారం రాత్రి ఓ వ్యక్తి అమ్ముతున్న మద్యాన్ని కొని తాగిన కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీత్గఢీ ప్రాంతంలో అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీనియర్ ఎక్సైజ్ అధికారులను పదవుల నుంచి తొలగించారు.