బీర్ వద్దు విస్కీ ముద్దు, మందుబాబుల అలవాట్లను మార్చేసిన కరోనా

  • Published By: naveen ,Published On : August 1, 2020 / 12:25 PM IST
బీర్ వద్దు విస్కీ ముద్దు, మందుబాబుల అలవాట్లను మార్చేసిన కరోనా

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో శానిటైజర్లు కనిపిస్తున్నాయి. గతంలోలా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా కలిసి తిరగడం లేదు.



చిల్డ్ బీరు వద్దు వార్మ్ విస్కీ ముద్దు:
కాగా, కరోనా మహమ్మారి హైదరాబాద్ లోని మందుబాబుల్లోనూ విపరీతమైన మార్పే తెచ్చింది. వారి అలవాట్లు మార్చేసింది. మందుబాబులు.. బీరు వద్దు విస్కీ ముద్దు అంటున్నారు. ఆల్కహాల్ బెవరేజస్ లో విపరీతంగా అమ్ముడుపోయిన ఆల్కహాల్ ఏదైనా ఉందంటే అది బీరే. సీజన్ ఏదైనా బీర్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. చిల్డ్ బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అంటారు మందుబాబులు. ఒక్కొక్కరు 3 నుంచి 5 బీరు బాటిళ్లు కొంటారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. బీర్ కి డిమాండ్ తగ్గింది. బీర్ తాగేవాళ్లు తగ్గారు. బీర్ బదులు విస్కీకి డైవర్ట్ అయ్యారు నగరంలోని మందుబాబులు. దీనికి కారణం కరోనా మహమ్మారి.



బీరు తాగితే జలుబు చేస్తుందని భయం:
చిల్డ్ బీరు తాగితే జలుబు చేస్తుందని భయం పట్టుకుంది. కరోనా లక్షణాల్లో జలుబు ఒకటి అనే విషయం తెలిసిందే కదా. దీంతో మందు ప్రియులు బీరు వదిలేసి విస్కీ బాట పట్టారు. విస్కీ కాస్త వెచ్చగా ఉంటుంది, సో జలుబు వచ్చే ప్రమాదం లేదన్నది వారి అభిప్రాయం. ఈ కారణంగానే నగరంలో బీరు విక్రయాలు గణనీయంగా తగ్గాయని వైన్ షాప్ ఓనర్లు తెలిపారు. గతంలో అంటే కరోనాకు ముందు ఒక్కో వ్యక్తి ఒకటికి మించి బీరు బాటిల్ కొనుక్కుని వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.



టాప్ లో బ్లెండర్స్ ప్రైడ్ విక్రయాలు:
45 రోజుల లాక్ డౌన్ తర్వాత మే నెలలో వైన్ షాపులు రీఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా మందుబాబులు బీర్ కన్నా ఎక్కువగా విస్కీనే కొంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోందని వైన్ షాప్ ఓనర్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కువమంది కస్టమర్లు విస్కీ మీద మాత్రమే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు, అది కూడా ఫుల్ బాటిల్స్ మీద. ఎక్కువమంది బ్లెండర్స్ ప్రైడ్ ని కొంటున్నారు. ఆ తర్వాత మెక్ డొవెల్స్ సిగ్నేచర్, రాయల్ చాలెంజ్, రాయల్ స్టాగ్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని వైన్ షాపుల ఓనర్లు చెప్పారు.

45శాతం తగ్గిన బీరు అమ్మకాలు:
బీరు విక్రయాలు తగ్గిపోవడంతో వైన్ షాప్ ఓనర్లు కూడా బీర్ స్టాక్ తగ్గించేశారు. గత కొన్నేళ్లలో బీరు విక్రయాలు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి అని ఓ వైన్ షాపు యజమాని చెప్పాడు. వేసవిలో 45శాతం బీరు విక్రయాలు పడిపోయాయి, ఇప్పుడూ అదే ట్రెండ్ కొనసాగుతోందని వివరించాడు. చిల్డ్ బీరు తాగితే జలుబు వస్తుందనే భయంతో బీరు తాగడం మానేశారు అని తెలిపారు.



మరోవైపు, వైన్ షాపులు తమ సిబ్బందితో పాటు వినియోగదారుల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన కోవిడ్ -19 భద్రతా చర్యలను అమలు చేస్తున్నాయి. వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి షాప్ ప్రవేశద్వారం ముందు ప్లాస్టిక్ షీట్ ఏర్పాటు చేశారు. మాస్కు ఉంటేనే కస్టమర్ కి మద్యం అమ్ముతున్నారు.