Chandrababu : ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమే : చంద్రబాబు
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు.

Chandrababu
Chandrababu : ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. 1995లో తయారు చేసిన విజన్ తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. హైస్కూల్స్ లేని రంగారెడ్డి జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు.
టీడీపీతోనే తెలుగు యువత ప్రపంచాన్ని జయిస్తున్నారని పేర్కొన్నారు. 25ఏళ్ళ క్రితం హైదరాబాద్ తో ప్రస్తుత హైదరాబాద్ ను యువత పోల్చుకోవాలన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు కారణం టీడీపీ అని వెల్లడించారు. ఆర్టీసీలో మహిళలకు కండక్టర్లుగా అవకాశం కల్పించామని గుర్తు చేశారు.
రాష్ట్రాలుగా విడిపోయిన అభివృద్ధిలో ముందుండాలనేదే టీడీపీ విధానం అన్నారు. విభజన సమయంలో సమన్యాయం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని అన్నారు.
ఏ ఇద్దరు అన్నదమ్ములు సమానంగా ఉండరనటానికి అంబానీ బ్రదర్స్ ఉదాహరణ అని పేర్కొన్నారు. తన తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు. కేసీఆర్ సహా.. తన తర్వాత వచ్చిన నలుగురు సీఎంలు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను తన హయాంలో నిర్మించినట్లు తన మనసాక్షికి తెలుసన్నారు. పేరు, ఓటు కోసం కాదు.. తెలుగుజాతి కోసం తాను పని చేశానని స్పష్టం చేశారు.