మేం గెలిస్తే పేరు మారుస్తాం: బీజేపీ హామీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి గట్టిగా కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో తమ పట్టు నిలుపుకునేందుకు ఈ ఎన్నికలను వాడుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం(17 జనవరి 2020) విడుదల చేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో గెలుపొంది.. మేయర్ పదవిని చేపడితే.. మొదట నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించింది.
అదే విధంగా పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది. బీజేపీ గెలుపొందితే నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామని కూడా తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.