ఉగ్రవాద ముప్పు : తిరుమలకు ఇంటిలిజెన్స్ హెచ్చరిక
మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది. సెంట్రల్ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి దక్షిణాది రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు. దీంతో జన సంచారం అధికంగా ఉండే ఆధ్యాత్మిక నగరం అలర్ట్ అయింది.
ఉగ్రవాదులు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో చొరబడే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేయనున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ప్రజలు కూడా సహకరించాలని అపరిచిత వ్యక్తులు నుంచి అనుమానిత వస్తువులు తీసుకోవద్దని, సందేహంగా అనిపిస్తే వెంటనే లోకల్ పోలీసులకు 100, 8099999977 నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఇదే క్రమంలో రేణిగుంట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే వారి పాస్పోర్టులు తనిఖీ చేస్తుండటంతో పాటు భద్రత ఏర్పాట్లు పెంచారు. నగర ప్రవేశ ప్రాంతాల వద్ద వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల్లో సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.