ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట్లాడితే నియంతలా వ్యవహరిస్తున్నారనీ విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ జగన్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కౌన్సిల్ ను పునరిద్ధరిస్తే ఆయన కుమారుడు జగన్ అధికారంలోకి వచ్చి..కౌన్సిల్ ను రద్దు చేయటానికి పూనుకుంటున్నారని..తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులు బనాయిస్తు..ఏకంగా వ్యవస్థలనే రద్దు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు పోరాటాలు చేస్తుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారనీ రైతులకు..రాజధాని అమరావతికి వ్యతిరేకంగా వాదించటానికి సీఎం జగన్ లాయర్ కు రూ.5 కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని తనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి అడ్వకేట్ కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అది ప్రజాధనమని దాన్ని అమరావతి రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఏపీలో జగన్, విజయసాయిరెడ్డి చేతుల్లోకి వ్యవస్థ నడుస్తోందని..వీరిద్దరూ కలిసి ఏపీలోని 5 కోట్లమంది ప్రజల తలరాతల్ని రాస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.