సినీ రంగంలో ఏ మహిళను అడిగినా పవన్ చరిత్ర చెబుతుంది: వైసీపీ ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : November 6, 2019 / 04:17 AM IST
సినీ రంగంలో ఏ మహిళను అడిగినా పవన్ చరిత్ర చెబుతుంది: వైసీపీ ఎమ్మెల్యే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి. ప్రజలు ఛీ కొట్టినా ధోరణి మార్చుకోకుండా పబ్బం గడుపుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రశేఖర రెడ్డి. రాజకీయ లబ్ధికోసం ప్రతీ అంశాన్ని వాడుకుంటూ జగన్‌ ప్రభుత్వంపై నారా లోకేష్, పవన్ కళ్యాణ్ బురద చల్లుతున్నారంటూ విమర్శించారు.

కాకినాడలో మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి వీరబాబు అనే వ్యక్తి చనిపోతే స్వార్థ రాజకీయాల కోసం ఆ చావును వాడుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారని అన్నారు. పార్టీ తరఫున డబ్బు ఇస్తామని చెప్పి, రాత్రికి రాత్రే బయలుదేరి కాకినాడ వచ్చి టీడీపీ నేతలు  హడావుడి చేయడం చూస్తుంటే వాళ్లు ఎంత దిగజారారో అర్థం అవుతుందని అన్నారు.

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, చేతనైతే కుటుంబానికి సాయం చేయాలని, కానీ టీడీపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు పాలనలో ఎందుకు అడ్రస్‌ లేకుండా పోయారని నిలదీశారు చంద్రశేఖర రెడ్డి. 2014లో చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని టీడీపీ గెలుపుకు పవన్ సహకరించారని, చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయకుంటే ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శలకు దిగితే అదే స్థాయిలో పవన్‌కు సమాధానం చెబుతామని అన్నారు. పవన్‌కు ఉన్న లొసుగులు వేరెవ్వరికి లేవని, సినీ రంగంలో ఏ మహిళను అడిగినా పవన్‌ చరిత్రను చెబుతుంది అన్నారు. అన్న చిరంజీవి లేకపోతే నీ అడ్రస్‌ ఎక్కడ? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రశేఖర రెడ్డి. ప్రజల బలంతో ఎమ్మెల్యేలుగా మేము ఎన్నిక అయ్యామని, పవన్‌లా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోలేదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు.