ఎండ తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి వెళ్లిన మహిళలు : బోటులోనే ఎక్కువ మృతదేహాలు

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 02:54 AM IST
ఎండ తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి వెళ్లిన మహిళలు : బోటులోనే ఎక్కువ మృతదేహాలు

గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుకోలేక మహిళలంతా బోటులోని ఏసీ గదిలోకి వెళ్లారు. అదే సమయంలో బోటు ప్రమాదం జరిగింది. అయితే ఏసీ గది అద్దాలు, డోర్లు మూసి వేసి ఉండటంతో అందులో ఉన్న మహిళలు బయటకి రాలేకపోయారు. దీంతో వారు అందులోనే చనిపోయి ఉంటారని బోటు సిబ్బంది అంటున్నారు. బోటులోనే ఎక్కువ మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నదీ గర్భంలో మునిగిపోయిన బోటుని వెలికితీస్తే కానీ.. బోటులో ఎన్ని మృతదేహాలు ఉన్నాయనే దానిపై స్పష్టత రాదు. బోటు వెలికితీస్తే కానీ మృతదేహాలు బయటపడే అవకాశం లేదంటున్నారు.

విహార యాత్ర విషాదంగా మారింది. గోదావరిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయింది. ఇప్పటివరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 71మందితో పర్యాటక బోటు బయల్దేరింది. బోటులో 61మంది పర్యాటకులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 36మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. పాపికొండలు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. రాయల్ వశిష్ట బోటు నిర్వాహాకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైడ్ స్కాన్ సోనార్ టెక్నాలజీ ద్వారా మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

ఆదివారం(సెప్టెంబర్ 15,2019) ఉదయం 10.30 గంటలకు రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు పాపికొండలకు బయలుదేరింది. గండిపోచమ్మ ఆలయం దాటి… ముందుకు వెళ్తున్న క్రమంలో… దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. వరద ఉధృతిని తట్టుకోలేక బోటు మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు ఉన్న వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని.. చుట్టుపక్కల గ్రామస్తులు కాపాడారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 71మంది ఉన్నారు. అందులో 61మంది టూరిస్టులు, 10మంది బోటు సిబ్బంది ఉన్నారు.

Also Read : గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ